BRS | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ దేశాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నదన్న విషయం మరోమారు తేటతెల్లమైంది. మహారాష్ట్రలోని పలు గ్రామ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి బీఆర్ఎస్ పాలన తమకూ కావాలని నినదించారు. 130 గ్రామ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 57 చోట్ల (44శాతం) విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. 340 వార్డులను కూడా సొంతం చేసుకుని అధికార శివసేన (ఏక్నాథ్షిండే)-బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని షాకిచ్చింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం ముందు ఉంచిన సంక్షేమ అజెండాకు ఎంతగా ప్రజాదరణ దక్కుతున్నదీ ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దెబ్బతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ శకం మొదలైనట్టేనని ఆ రాష్ట్ర రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ ఫలితాలను ఉటంకిస్తూ ‘సర్కార్ నామా’ అనే మరాఠా పత్రిక.. ‘మహారాష్ట్రలో గులాబీ తుఫాన్ మొదలైంది’ అని రాసింది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న చాలా వరకు సర్పంచ్ స్థానాలు తెలంగాణ సరిహద్దుకు ఆమడ దూరంలో ఉండడం మరో విశేషం. దీనిని బట్టి తెలంగాణ మాడల్ను అక్కడి ప్రజలు ఎంతగా కోరుకుంటున్నదీ స్పష్టమైంది. అందుకు ఈ ఎన్నికలను నాంది పలికాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ ఎందుకంటే?
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించింది. రైతు బాగుంటేనే రాష్ట్రం, తద్వారా దేశం బాగుంటుందని నమ్మే సీఎం కేసీఆర్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. దీనికితోడు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఏదో రూపంలో సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలను కేంద్రంలోని అధికార బీజేపీ కాపీకొట్టి పేర్ల మార్పుతో ప్రకటించిన విషయాన్ని స్వయంగా దేశ ప్రజలే గుర్తించారు. సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల్లోనూ అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆర్పై మహారాష్ట్ర ప్రజలకు గురి కుదిరింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఫలితాలు.
‘మహా’ ఫలితాలు ఇలా
సోలాపూర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత భాగీరథ్ బాలే నేతృత్వంలో భండారా జిల్లాలో మొత్తం 27 గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో ఏకంగా 17 మంది సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. 90 మంది వార్డు సభ్యులుగా విజయం సాధించారు. నాగ్పూర్ జిల్లాలో సీనియర్ నేత చరణ్ వాగ్మారే నేతృత్వంలో తుమసర్ తాలుకాలో 55 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా 25 సర్పంచ్ పదవులు దక్కాయి. 185 మంది వార్డు సభ్యులుగా గెలుపొందారు.
నాగ్పూర్ జిల్లాలో డొర్నిముకణే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్పంచ్ పదవి కైవసం చేసుకోగా, నలుగురు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. అష్ఠి గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లుగా గెలుపొందారు. నాందేడ్ జిల్లా దేగ్లూర్-బిలోలి సమన్వయకర్త రమేశ్ గూళేకర్ నేతృత్వంలో గోగులగోవింద్ తండా గ్రామపంచాయతీని బీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. సర్పంచ్ పదవికి అమోల్హాన్తోపాటు ఏడుగురు వార్డు సభ్యులుగా గెలిచారు.
కొంకణ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె ఆధ్వర్యంలో రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవితో పాటు 11 మంది వార్డు మెంబర్లుగా గెలిచారు. ఫేణ్లో నలుగురు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఫాల్ఘర్ జిల్లాలో ఛరోటి, దబోన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవంగా విజయం సాధించారు. 9 మంది వార్డు మెంబర్లుగా విజయం సాధించారు. జల్గావ్ జిల్లాలో 8 సర్పంచ్ పదవులు, అహ్మద్నగర్ జిల్లాలో రెండు పదవులు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
కర్ణాటక మాడల్ను ఛీకొడుతున్న ప్రజలు
మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడల్కు ఓటేస్తే.. కాంగ్రెస్ మాత్రం కర్ణాటక మాడల్ అంటూ తెలంగాణ ప్రజలను మరోమారు అంధకారంలోకి తోసేందుకు ప్రయత్నిస్తున్నది. అక్కడ మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఆపై హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన హస్తం పార్టీ ఇక్కడ మాత్రం కర్ణాటక మాడల్ అంటూ ఊదరగొడుతున్నది. ఆ రాష్ట్రంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్న నేతలు తెలంగాణ ప్రజలకు మాత్రం అలవిగాని హామీలిస్తున్నారు. అవి విని ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ మాడల్కు ఇతర రాష్ర్టాలు సైతం జై కొడుతుంటే కర్ణాటక మాడల్ తమకెందుకని ప్రశ్నిస్తున్నారు. తాము బరాబర్ బీఆర్ఎస్తోనే ఉంటామని ముఖం మీదే చెబుతున్నారు. ముందు కర్ణాటకను చక్కబెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రకు కేసీఆర్ తెలుసా?
వాస్తవానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే మహారాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ, ఆయన మాడల్ గురించి మాత్రం అక్కడి ప్రజలకు పూర్తిగా తెలిసింది. దాని ఫలితమే ఈ ఫలితాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేత శంకరన్న దోంగ్డే పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కానీ, మంత్రులు కానీ, పేరున్న నాయకుడు కానీ రాకపోయినా 57 గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం మాటలు కాదని, తెలంగాణ మాడలే ఇందుకు కారణమని ఆయన వివరించారు.
తెలంగాణ మాడల్ మాకు ఆశాకిరణం
తెలంగాణ మాడల్ గురించి మహారాష్ట్ర అంతటా చర్చించుకుంటున్నారు. మాకూ ఆ మాడల్ కావాలని కోరుకుంటున్నారు. అందుకు ఈ ఫలితాలే నిదర్శనం. మరాఠ్వాడా, విదర్భ సహా మహారాష్ట్రలో రోజుకు సగటున ముగ్గురు రైతులు బలవన్మరం పాలవుతున్నారని అనేక నివేదికలు చెప్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి ఉంచడం, పండిన ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొనడం వంటివి రైతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలపై మహారాష్ట్ర మహిళలు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్ర బతుకులను కేసీఆర్ మాత్రమే మార్చగలరు. బీఆర్ఎస్ పార్టీ మాకు ఆశాకిరణం.
-సుధీర్ సుధాకర్రావుబిందు, షెత్కారీ సంఘం నేత
ఈ ఫలితాలు భవిష్యత్తుకు దిక్సూచి
మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ప్రతి ఇంటిని తట్టిలేపిందనడానికి ఇవి నిదర్శనం. ఎన్సీపీ, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించారు. ఈ ఫలితాలు మాలో నూతనోత్తేజం నింపాయి.
-మాణిక్ కదం, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు