Vinod Kumar | వేములవాడ : తెలంగాణలో ఈ ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వంద సీట్లు సాధించి మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సంగీత నిలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒకరూ పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలను పరిషరించుకుంటూ ఎమ్మెల్యేలు పూర్తిగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యమై పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఎమ్మెల్యేలు వివరిస్తూనే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.
పలుచోట్ల ఎమ్మెల్యేలను మార్చబోతున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపడేశారు. సీఎం కేసీఆర్ చీటికిమాటికి అభ్యర్థులను మార్చరని, వేములవాడ బరిలో ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్బాబు పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. వారం రోజుల్లోనే వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తవుతాయని చెప్పారు. వేములవాడ ప్రభుత్వ దవాఖాన పనితీరుపై సీఎం కేసీఆర్కు కూడా వివరించామని, ఆయన ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత సీఎం కేసీఆర్కు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 1.6లక్షలుగా ఉన్న తలసాని ఆదాయం ప్రస్తుతం 3.17లక్షలకు పెరిగిందన్నారు. పార్లమెంట్ వేదికగా ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి స్వయంగా దేశంలోనే అభివృద్ధిలో ఎదుగుతూ సంక్షేమాన్ని అందిస్తూ తలసరి ఆదాయం పెరిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పెరిగిన తలసరి ఆదాయం, జరుగుతున్న అభివృద్ధిపై ఆర్థిక సంస్కరణల మేధావులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణే తొలి స్థానంలో ఉందన్నారు.
రైల్వే పనులు ఇప్పటికే వేగవంతంగా సాగుతున్నాయని వినోద్కుమార్ తెలిపారు. సిద్దిపేట వరకు రైల్వే పనులు పూర్తయ్యాయని, సిద్ధిపేట – సిరిసిల్ల వరకు చేయాల్సిన పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. మానేరు జలాశయంపై రైల్వే వంతెన నిర్మిస్తామన్నారు. వేములవాడలో రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టును ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి విషయంలో ఇబ్బంది గురి చేస్తున్నా, ఇతర రుణాలు, ఆర్థికంగా నిధులను కేటాయిస్తూ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.