Harish Rao | సంగారెడ్డి : మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని హరీశ్రావు సూచించారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
జూన్ 4వ తేదీన మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవబోతున్నారని, ఇందులో తనకు ఎలాంటి అనుమానం లేదని హరీశ్రావు చెప్పారు. మెదక్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. ఈసారి కూడా తప్పకుండా మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరబోతోంది. మనకే కాదు.. ప్రతిపక్షాలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో బీఆర్ఎస్ గెలవబోతుందని వారికి కూడా అర్థమైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో సర్వే చేసుకున్నాక కాంగ్రెస్ పార్టీ తోక ముడించింది. బీజేపీ అభ్యర్థి మంచోడు అయితే మొన్నటి ఎన్నికల్లో దుబ్బాకలో గెలవాలి కదా..? నాలుగేండ్ల పాలన చూసిన తర్వాత ఆయనను ఓడగొట్టారు. బీజేపీ అభ్యర్థి పనిమంతుడు అయితే.. ప్రభాకర్ రెడ్డిని 54 వేల ఓట్ల మెజార్టీతో ఎందుకు గెలిపించారని హరీశ్రావు అడిగారు.
వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వస్తా అనుకోలేదు. ఎంపీకి పోటీ చేస్తా అనుకోలేదు. వెంకట్రామిరెడ్డి మనసున్న మనిషి. అనాథ పిల్లలను ఎందర్నో ఆదుకొని ఉన్నత విద్య చదివించారు. మరో ఇద్దరు అనాథ పిల్లలకు ఇల్లు కట్టించి అండగా నిలిచారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రూ. 100 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతానని గొప్పగా ముందుకు వచ్చారు. అలాంటి మనిషిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కలిసికట్టుగా పని చేస్తే మెదక్ ఎంపీ గెలుస్తాం. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయని హరీశ్రావు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ జరగలేదు. అప్పులు కట్టాలని రైతులను బ్యాంకర్లు వేధిస్తున్నారు. మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. రూ. 15 వేల రైతుబంధు, రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఏ ఒక్కటి అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. 100 రోజుల పాలన చూసి ఓట్లు వేయమని రేవంత్ అడుగుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కళ్లు తెరిచి రైతు రుణమాఫీ చేస్తదని హరీశ్రావు పేర్కొన్నారు.