Telangana | ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రతినిధులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, హరీశ్రావు, కడియం శ్రీహరి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలో చర్చించుకున్నామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా కేవలం 1.8 మాత్రమే అని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని.. అధికారంలోకి రాగానే రైతుబంధు, రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడ్డారని ఆయన అన్నారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. తమ బలం.. బలగం కేసీఆర్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుండదు అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అని జోస్యం చెప్పారు.