హైదరాబాద్/సిద్దిపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట (Siddipet) జిల్లాలో బీఆర్ఎస్ (BRS) పార్టీ విజయదుందిభి మోగించింది. అధికార పార్టీ కాంగ్రెస్కు (Congress) ప్రజలు గట్టి షాకిచ్చారు. కారు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించడం పట్ల హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్లను ఆదివారం రాత్రి ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. సిద్దిపేట జిల్లాలో 182 స్థానాలకుగాను 10 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 172 స్థానాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 117 మంది గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 27 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 12 స్థానాల్లో, 16 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఏకగ్రీవాలతో కలుపుకొని మొత్తంగా రెండో విడతలో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులు 125 స్థానాల్లో విజయం సాధించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వన్సైడ్ అయ్యాయి. నియోజకవర్గంలో సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని మొత్తం 91 గ్రామలకుగాను 78 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఐదు, బీజేపీ మద్దతుదారులు రెండు, స్వతంత్రులు ఆరు స్థానాల్లో గెలిచారు. నంగునూరు మండలం సంతోష్నగర్, ఖాత, సిద్దిపేట అర్బన్ పాండవపురం, చిన్నకోడూరు మండలం రామంచ గ్రామాల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. మిగిలిన 87 గ్రామాల్లో ఎన్నికలు జరుగగా, వీటిలో 74 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని సత్తా చాటింది. అత్యధిక గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.

దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, భూంపల్లి-అక్బర్పేట, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో మొత్తం 67 గ్రామాలకుగాను నాలుగు గ్రామాలు ఏకగ్రీవం కాగా, వాటిలో రెండింటిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులున్నారు. మరో రెండింటిలో స్వంతంత్రులు ఉన్నారు. మిగిలిన 63 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీఆర్ఎస్ మద్దతుదారులు 35, కాంగ్రెస్ మద్దతుదారులు 11, బీజేపీ మద్దతుదారులు 10, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అభినందనలు తెలియజేశారు.

సిద్దిపేట నియోజవర్గ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్లకు మాజీ మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. పదవిని బాధ్యాతయుతంగా భావించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఉద్బోధించారు. అరుదుగా వచ్చిన అవకాశాన్ని ప్రజల ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 91 స్థానాల్లో 78 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన గ్రామీణులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.