BRS protest: ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలకు దిగాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు కూడా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలకు రేపు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
ఈ ఉదయం 9.30 గంటలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమీర్పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్తోపాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.