కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా యాసంగి పంటలకు అందించలేదు. దీంతో పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు పక్కనబెట్టి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను కండ్లారా చూసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు రైతుల చెంతకు వస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొని వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ మండలం మొగ్దుంపూర్లో ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ-93 పరిధిలోని మొగ్దుంపూర్లో యాసంగిలో సాగుచేసిన 60 శాతం పంటలు ఎండిపోయాయి. ఆయకట్టు చివరి భూముల సంగతి దేవుడెరుగు.. కాలువ మొదట ఉన్న పంటలు కూడా నీళ్లందక ఎండిపోయాయి. ఈ కారణంగా గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారు.
శుక్రవారం ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10:30 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్కు చేరుకుంటారు. ఎండిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.