మళ్లీ లేస్తం.. గెలుస్తం
భూమి, ఆకాశం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటది
ఇది బ్రేక్ మాత్రమే.. కొద్దిరోజుల్లోనే అధికారంలోకి వస్తం
కరీంనగర్ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఉద్యమించిన
కాంగ్రెస్, బీజేపోళ్లు గుండెనిండా తెలంగాణ అంటరా?
300 పిల్లర్లల్ల రెండు కుంగితే ఇంత రాద్ధాంతమా?
ఒక్క పన్ను వదులైతే.. పండ్లన్నీ ఊడగొట్టుకుంటమా?
420 హామీల కాంగ్రెస్.. పంట బోనస్ ఓ బోగస్..
తెలంగాణ ప్రజల బలం, గళం, దళం.. బీఆర్ఎస్సే
బీఆర్ఎస్ అంకుశం అయితేనే కాంగ్రెస్ సక్కగ నడుస్తది
పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం?
బేవార్స్ చానళ్లు, బ్రోకర్గాళ్లు ప్రచారం బంద్జెయ్యాలె
తమాషాకు ఓటేయొద్దు.. ఆలోచించి నిర్ణయించుకోవాలె
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిప్పులు చెరిగారు. కట్క బంద్ అయినట్టు వందరోజుల్లోనే కరెంటు ఎట్లా మాయమైందని, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని, మిషన్ భగీరథలో సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ‘మేము తొమ్మిదేండ్లు చేసింది.. కాంగ్రెసోళ్లకు వంద రోజులు కూడా చేయడం చేతనైతలేదా?’ అని నిలదీశారు. మంగళవారం కరీంనగర్లోని ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించిన కరీంనగర్ కదనభేరిసభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశామని, ఇప్పుడు మరోసారి కరీంనగర్ గడ్డ మీది నుంచే పోరాటం మొదలుపెడుతున్నానని చెప్పారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
కరీంనగర్ గడ్డ మట్టిని బొట్టుగా పెట్టుకున్న తెలంగాణ ఆశలు అడియాసలై.. దిక్కుతోచని స్థితి. భయంకరమైన కరువు కాటకాలు, కరెంటు కోతలు, ఆత్మహత్యలు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ. దిశ దశ లేకుండా ‘అన్నమో రామచంద్ర’ అని అలమటిస్తున్న సమయం. 2001లో ఎవరికీ తెలంగాణ రాష్ట్రం వస్తుందనే విశ్వాసం లేదు. తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో మాట్లాడొద్దని ఆంక్షలు. ఆరోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ల మొఖాన పడేసి, తెలంగాణ సొంత రాష్ట్రంగా నిలబడాలె, కలబడాలె అని పిడికెడుమందితో ‘జై తెలంగాణ’ అని బయలుదేరిన. ఎక్కడ మీటింగ్ పెట్టాలె, ఎక్కడి నుంచి ప్రజల్లోకి పోవాలె అని హైదరాబాద్లో చర్చోపచర్చలు. చైతన్యవంతమైన ప్రజలున్న జిల్లా, పోరాటాల గడ్డ కరీంనగర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించినం.
ఇదే ఎస్సారార్ కాలేజీ మైదానంలో మే 17న 48 డిగ్రీల ఎండ. అయినా ప్రజలు ఉద్యమానికి ఊపిరులు ఊదుతారని నమ్మి వస్తే.. తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకుఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఈ గడ్డ మట్టినే నుదిటిన బొట్టుగా పెట్టుకొని, కార్యాచరణ ప్రకటించి ఉద్యమం కోసం బయల్దేరిన. తర్వాత కథంతా ప్రజలందరికీ తెలుసు. ప్రజలే కథానాయకులై ముందుకు నడిపారు. మా మీద నువ్వు గెలిచినవా కేసీఆర్? నీ లెక్కెంత? అని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే నాకున్న ఎంపీ పదవిని నేలకొసి కొట్టి.. కరీంనగర్కు రా అని వచ్చిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో, ఎన్ని మాయోపాయాలు చేసిందో, ఎన్ని గింగిరాలు కొట్టిందో అందరికీ తెలుసు. అయినా బ్రహ్మాండంగా 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి కరీంనగర్ గడ్డ తెలంగాణ అడ్డా అనే రీతిలో చైతన్యాన్ని చాటారు.
కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో మరో రకంగానో ప్రజలు మోసపోతరు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోసపోయి కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసినరు. 100 రోజుల్లోనే ఏం జరుగుతున్నదో చూస్తున్నరు. మేం ఎక్కువ ఇస్తం, ఆరు చందమామలు పెడతం, ఏడు సూర్యుళ్లు పెడతం అని వాళ్లు మాట్లాడారు. రైతుబంధు రూ.15వేలు ఇస్తాం, కల్యాణలక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తం అంటూ 420 హామీలు ఇచ్చినరు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నరు? రైతుబంధు అడిగితే చెప్పుతోని కొడతా అని ఒక మంత్రి అంటున్నడు. బిడ్డా రైతుల చెప్పులు బందవస్తు ఉంటయి. ఆరు గ్యారెంటీలు ఏవీ? కరెంటు ఎందుకు మాయమైంది? నీళ్లు ఎందుకు మాయమైంది? అని అడిగితే.. పండవెట్టి తొక్కుత, పేగులు మెడలో వేసుకుంట, పెండ మొఖానికి రాసుకుంట, చీరుత, సంపుత, మానవబాంబునైత, మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు.
ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా? తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా? మాకు మాట్లాడరాదా? నేనూ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన. తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు, సన్నాసులు అన్న. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేండ్లలో ఒక్కసారన్నా అలాంటి దురుసు మాటలు విన్నరా? పదేండ్లు బ్రహ్మాండమైన పాలన చేసినం. తెలంగాణ వచ్చిననాడు కొత్త కుండలో ఈగలు సొర్రినట్టు దిక్కు దివానం లేదు. కరంటు లేదు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్లకు అన్నమో రామచంద్ర, నేతన్న ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఒక భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ముఖ్యమంత్రిని చేశారు.
ఆంధ్రావాళ్లు మోసం చేసి పోయినరు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోటి నుంచి ఎప్పుడన్నా విన్నరా? లంకెబిందెల కోసం వచ్చిన అని అన్ననా? సీఎం అట్లా మాట్లాడొచ్చా? ఏ పరిస్థితి దొరికిందో, ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎలా సరిచేయాలో చూడాలె. మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పనిచేసింది. ప్రజలు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు. మీ మీద మాకు ఎలాంటి ఈర్ష్య లేదు. మా కన్నా మంచిగ పనిచేయి. మంచి పేరు తెచ్చుకో, మాతో పోటీ పడు. అంతేగానీ చీరుతం, చెప్పుతో కొడుతం అనడం మానుకోవాలి.
మన కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్న నాయకుడు వినోద్కుమార్. క్లీన్ క్యారెక్టర్ ఉన్న నాయకుడు. ఈయనకూ బండి సంజయ్కు పొంతనలేదు. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా. కరీంనగర్ ప్రజలు గమనించాలి. ఎవరు ఉంటే బాగుంటుందో నిర్ణయించి ఓటు వేయాలి. వినోద్కుమార్ను గెలిపించాలి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ.. ఎవరైనా గుండెల నిండా జై తెలంగాణ అని నినదిస్తారా? ఆ మాట అనేది వినోద్కుమార్. అనిపించేది గులాబీ జెండా. ఆయన ఉపన్యాసం మొదలు పెట్టినప్పుడు, ముగించినప్పుడు గుండె పగిలిపోయేలా ‘జై తెలంగాణ’ అన్నడు. దేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు నవోదయ ఇవ్వాలనేది కేంద్రం చట్టం. మనం 10 నుంచి 33కు పెంచినం.
నా రాష్ట్రం దేశానికే తలమానికం కావాలని అహోరాత్రాలు కష్టపడ్డం. భగీరథ ప్రయత్నం చేసి, అహోరాత్రులు పనిచేసి మిషన్ భగీరథకు రూపలక్పన చేసినం. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మల్లా ఓట్లు అడగనని చెప్పి, ఆ మాట నిలబెట్టుకున్నం. ఇప్పుడున్న ప్రభుత్వానికి మిషన్ భగీరథను నడిపే తెలివి లేదా? ఎందుకు సమస్యలు వస్తున్నయి? నేను సీఎం అయినప్పుడు కరెంటు ఎట్లా ఉండేదో అందరికీ తెలుసు. ఏడాదిన్నరలో దాన్ని బాగు చేసినం. రెప్పపాటు కరెంటు పోకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఇచ్చినం. రైతుబంధు ఇచ్చినం. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బులు లేకున్నా, అప్పోసప్పో చేసైనా రైతుబంధు ఆపలేదు. ఇయ్యాల రైతుబంధు వెయ్యడానికి చేతనైతలేదా? కేసీఆర్ మొఖం అటు మలగంగనే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అయితదా? నేను తొమ్మిదేండ్లు చేసింది ఈ చవట దద్దమ్మలకు చేతనైతలేదా? ప్రజలు ఆలోచించాలి.
మల్లా కాంగ్రెస్కే ఓటేస్తే.. మేం రైతుబంధు ఇయ్యకున్నా, కరెంటు ఇయ్యకున్నా, మోటర్లు కాలవెట్టినా, మల్లా మాకే గుద్దిర్రు అంటరు. ఆరు గ్యారెంటీలు లేవు.. మూడు గ్యారెంటీలు లేవు. అన్నింటికన్నీ ఎగనామం పెడతరు. ఈ టైంలోనే మీరు కర్రుకాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వస్తది, అహంకారం పెరిగిపోతది, ఇప్పుడు చెప్పుతో కొడుతా అన్నోడు రేపు నిజంగానే కొడతడు. ఆవిధంగా మోసపోదామా? బీఆర్ఎస్ జెండా ఎగరేసి బ్రహ్మాండంగా ముందుకు పోదామా? అని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరిగితే ప్రజల పక్షాన కాపలాదారులుగా బ్రహ్మాండంగా ముందుకుపోతాం.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎకరం పొలమైనా ఎండిపోయిందా? ఇప్పుడు ఏం బీమారి(రోగం) వచ్చింది? మళ్లీ రైతుల ఆత్మహత్యలు రావాల్నా? మేం ఏం చేసినా పద్ధతి ప్రకారం చేసినం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరూ దరఖాస్తు ఇవ్వలేదు, దండం పెట్టలేదు, ధర్నా చేయలేదు. అయినా రైతుబంధు తీసుకొచ్చినం. చరణ్సింగ్, దేవీలాల్, వసంత్దాదా పాటిల్ ఇలా చాలామంది రైతుబిడ్డలు ముఖ్యమంత్రులయ్యారు. కానీ, ఏ రైతు నాయకుడూ ఇలాంటి పథకం తీసుకురాలేదు. ఇండియాలోనే మొదటిసారిగా రైతుబంధు పథకం మొదలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇచ్చేలా రైతుబీమా పథకాన్ని అమలు చేసినం. ఇప్పుడు ఈ పథకం గురించి ప్రభుత్వం ఏం మాట్లాడుతనే లేదు. ఇలా రాష్ట్రంలో ఏవిధంగా పరిశ్రమలు వచ్చాయి? ఏ విధంగా ఐటీ వచ్చింది? రాష్ట్ర జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరిగింది? అనే అంశాన్ని మేధావులు, ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. పచ్చని పొలాలు, కరెంట్ ఎట్లా మాయమైనయి? అన్నీ మీరే చూస్తున్నారు.
ప్రతిదానికి మీరే ప్రత్యక్షసాక్షులు. కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చని పొలాలు ఎట్లా ఉండెనో, 24 గంటల కరెంట్ ఎలా వచ్చిందో మీకు తెలుసు. కానీ ఇంతలోనే ఇవన్నీ ఎట్లా మాయమయ్యాయి? ఎందుకు మాయమయ్యాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పారు. రైతులకు వరికి బోనస్ ఇస్తామన్నారు. వానకాలం పంటకు బోనస్ ఇచ్చారా? కనీసం యాసంగి పంటకైనా ఇస్తామని చెప్తున్నారా? బోనస్ బోగసైంది. ఇలా అనేక విషయాల్లో మాట తప్పుతున్నారు. పదవిలోకి ఇప్పుడిప్పుడే వచ్చాం కదా.. ఇప్పుడు అబద్ధాలు ఆడితే ఎలా? అనే ఇంగితం లేకుండా అడ్డగోలుగా, నానా బూతులు మాట్లాడుతున్నరు. కేసీఆర్పై ఏడ్చుకుంటూ పని చేస్తున్నరు.
మేడిగడ్డ అని, ఆ గడ్డ అని చెప్తూ… ఎంతసేపూ కేసీఆర్ను ఎలా బద్నాం చేయాలనే తప్ప మరో ఆలోచన లేదు. మన నోట్లోని పన్నుల్లో ఒక పన్ను పాడైతే 32 పన్నులు రాలగొట్టుకుంటమా? ఏ పన్నైతో ఊగుతదో ఆ పన్నును బాగు చేసుకుంటాం కానీ మొత్తం పన్నులను రాలగొట్టుకోం కదా. కాళేశ్వరంలో కలిసే నదులు, ఉపనదులు, గోదావరి నదిపైనా మొత్తం 300కు పైగా పిల్లర్లు ఉంటయి. ఇందులో రెండు పిల్లర్లు కుంగిపోతే భారతదేశమే మునిగిపోతున్నట్టు బొబ్బ చేసి కేసీఆర్పై బద్నాం పెట్టాలనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మన గతి ఏం కావాలి? ఏం జరుగబోతున్నది? అందుకే మళ్లీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ నాయకునికి, కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ విషయం చూసినా కాంగ్రెస్ వాళ్ల పద్ధతి సరిగ్గా లేదు.
ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే విధానం చూడండి. మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపామో చూడండి. ఎన్ని రకాల పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని ఏవిధంగా కడుపులో పెట్టుకున్నామో చూడండి. మేము బతుకమ్మ చీరలను తమాషా కోసం, చెక్కిలిగింతల కోసం తీసుకురాలేదు. నాడు ఉద్యమంలో నేను, ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుం టే… ‘గోడలపై ఆత్మహత్యలు చేసుకోవద్దు.. చావు సమస్యలకు పరిష్కారం’ కాదు అనే రాత లు కనిపించాయి. అవి చూసి మేం ఏడ్చినం. 60 ఏండ్ల స్వాతంత్య్రంలో చావుల గురించి మాట్లాడుతుంటే సిగ్గుపడాలని, ఇక తెలంగాణ వస్తే తప్ప మనం బతుకలేమని అనుకున్నాం. సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే పార్టీ నుంచి రూ.50 లక్షలు తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చి ‘మీకు దండం పెడుతమయ్యా.. ఏడాది దాకా చావకండి. తెలంగాణ వచ్చేదాకా బతకండి. ఆ తర్వాత మేమే మిమ్మ ల్ని బతికించుకుంటాం’ అని చెప్పినం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే విద్యార్థుల యూనిఫాంలు, బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చి.. చేనేతమిత్ర వంటి పథకాలను పెట్టినం. గత తొమ్మిదేండ్ల నుంచి చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. పవర్లూమ్స్ను ప్రోత్సహించినం, వాళ్లను కాపాడే ప్రయత్నం చేసినం. ఇలా మేం ఏం చేసినా ప్రజల్ని , పేదవర్గాలను, రైతులను దృష్టిలో పెట్టుకొని పని చేసినం.
నేను మోదీకి 150 ఉత్తరాలు రాసిన, స్వయంగా కలిసి అడిగిన. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలె? దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి? కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం చేశారో ఆలోచించాలి. ఆయన కనీసం ఐదు రూపాయల పనైనా చేశాడా? వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్సిటీ కోసం, జాతీయ రహదారుల కోసం, రైలు మార్గం కోసం కేంద్రంతో కొట్లాడి అన్నీ తీసుకొచ్చిండు. బండి సంజయ్కి, వినోద్కుమార్కు ఏమైనా పోలిక ఉందేమో ఓటు వేసే ముందు ఆలోచించాలి. వినోద్ వంటి వ్యక్తి ఎంపీగా ఉంటే లాభం జరుగుతుంది. నా వెంట నిజాయితీగా, ఆసాంతం ఉద్యమ పొడవునా ఏనాడూ మడమతిప్పని ఉద్యమ నాయకుడు వినోద్కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ బరాజ్ ఒక చిన్న కాంపోనెంట్. ఇందులో ఇసుక జారిపోయి రెండు పిల్లర్లు కుంగినయి. దీనికే ప్రళయం బద్దలైనట్టు, దేశం కొట్టుకుపోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో నేనే స్వయంగా టీవీల్లో కూర్చొని కాళేశ్వరం సంగతేంటి? దాన్ని ఎందుకు నిర్మించామో ప్రతి ఇంటికి చేరేలా అన్ని విషయాలు చెప్తా. కరీంనగర్ జిల్లాలో పుష్కలమైన నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం పుణ్యమే కదా. మిడ్మానేరు, ఎల్ఎండీ నిండి ఉండుంటే, చెరువులు, చెక్డ్యాంలు, మత్తల్లు నిండి దుంకుతుండె. కానీ అన్నీ ఎండిపోయిన కనిపిస్తున్నయి. ఇవి చూస్తుంటే మనుసులో చాలా దుంఖం కలుగుతున్నది.
నా కండ్ల ముందే.. ఇంత తొందర్లోనే కరెంట్ మాయం కావడం, రైతుల కండ్లలో నీళ్లు పెట్టుకోవడం బాధ కలిగిస్తున్నది. నీళ్లు లేక రైతులు తమ ఎండిన పొలాలను కాలపెడుతున్నరు, గొర్లను, గొడ్లను మేపుతున్నరు. ఇలా రైతులు నాశనమైతున్నప్పటికీ ‘నేను పేగులు మెడలేసుకుంటా.. పండవెట్టి తొక్కుతా’ డైలాగులే తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తలేరు. రైతు సోదరులారా! భయపడకండి… ఒకప్పుడు ఇదే ఎస్సారెస్పీకి నీళ్లు తక్కువైతే, సింగూరు డ్యాంలో నీళ్లుంటే, అక్కడినుంచి వరంగల్ వరకు నీళ్లు తీసుకొచ్చి పంటలను కాపాడినం. ప్రభుత్వం అంటే అలా ఉండాలే. దమ్ము, ధైర్యం ఉండాలే. రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ, సోయి ఉండాలే. ఆ ప్రేమ ఉంటే రైతులకు ఇయ్యాల ఈ పరిస్థితి రాకపోతుండె.
బీజేపోళ్లు ఎన్నడైనా రాష్ర్టానికి పైసలు తెచ్చారా? రాష్ర్టానికి ఏమైనా లాభం చేసిండ్రా? దేశం అన్ని విధాలుగా నష్టపోతున్నది. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. నదుల్లో 70వేల టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. 40 కోట్ల ఎకరాల సాగుభూమికి సరిపడా సాగు నీరుంది. కేంద్రంలో కూడా సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే.. ఈ దేశం బ్రహ్మాండంగా ముందుకుపోయేది. ప్రజలు బ్రేక్ కొట్టి నన్ను ఆపారు. నేను తెలంగాణలో గెలిచి ఉంటే.. అభివృద్ధి కోసం ఈ పాటికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని, చిచ్చు అంటించేవాడిని. మొత్తం దేశాన్నే చైతన్యవంతం చేసేవాణ్ణి. చిన్న దెబ్బ తగిలింది. ఫర్వాలేదు. మనం ఉద్యమాలు చేసినోళ్లం. పేగులు తెగేదాక కొట్లాడే శక్తి ఉన్నోళ్లం. ధైర్యంగా ముందుకుపోదాం. దళితబంధు తెచ్చినా, చేనేత కార్మికుల కోసం పథకాలు తెచ్చినా, రైతుబంధు, గురుకులాలు, బీసీలకు పథకాలు తెచ్చినా.. ఏది తెచ్చినా కులం, మతం, జాతి ప్రస్తావన లేకుండా తీసుకొచ్చాం. మనం కూడా తెలంగాణ జాతిగానే కొట్లాడదాం, నిలబడదాం.
కొందరు పవర్ బ్రోకర్గాళ్లు, కొన్ని బేవార్స్ చానెళ్లు ఎప్పుడూ ఉంటయి. బీఆర్ఎస్ పుట్టిననాడే .. మఖలో పుట్టింది పుబ్బలో పోతుందన్నరు. పుబ్బలో పోలేదు మీ ఈపులే పగిలినయ్ బిడ్డా. మిమ్మల్ని ఎక్కడిదాంక తరిమినమో మీకూ తెలుసు. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు.. తెలంగాణ ఉండేదాక ఈ గులాబీ జెండా ఉంటుంది. ఇది ఖాయం. అక్కడ్నో, ఇక్కడ్నో ఒకరిద్దరు తలకమాసినోళ్లు పోతే.. కొన్ని బేవార్స్ చానెళ్లు బీఆర్ఎస్ ఖతమైందని మాట్లాడుతున్నయి. నేటికీ అట్ల అన్నోడే ఖతమైండు కానీ, గులాబీ జెండా ఎప్పుడూ ఖతం కాలేదు. బిడ్డా జాగ్రత్తా.. మీ దొంగ ప్రచారాలకు ఇక్కడెవ్వడూ భయపడేటోడు లేడు. మళ్లా కొద్దిరోజులోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్లీ తెలంగాణను ఎట్ల వైభవంగా తీర్చి దిద్దుతదో మీరే కండ్లార చూస్తారు. మళ్లా మీరే సలాములు కొట్టుకుంటా వస్తరు. కాబట్టి మీ బేవార్స్, బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి.
వ్యవసాయ స్థిరీకరణతో రైతుబంధు తీసుకొచ్చినం. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినం. రైతులు పండించిన ప్రతి గింజను కొని నేరుగా వాళ్ల బ్యాంకులో డబ్బులు వేసినం. ఈ సదుపాయంతో రైతులకు గుండెధైర్యం వచ్చింది. కానీ మూడు నెలల్లోనే పంట లు ఎండబెట్టే పరిస్థితి చూస్తుంటే నా కండ్లల్లోనూ నీళ్లు వస్తున్నయి. ఇది ఏం అన్యాయం? నాడు సమైక్య పాలకులను తిట్టినం.. కానీ, ఇప్పుడు అంతకంటే దారుణంగా పరిస్థితి తయారైంది.
పోలీసు సోదరులారా! మీరు అనవసరంగా గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినోళ్లను కూడా బెదిరిస్తున్నారు. ఇది మంచిదికాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? మేము పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తే.. కాంగ్రెసోడు ఒక్కడైనా మిగులునా ఈ రాష్ట్రంలో? మేము ఆ దారి పట్టలేదు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశాం.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ జాతి మొత్తం ఏకం కావాలి. అందరూ కుల, మతాలకు అతీతంగా బాగుపడేందుకు గులాబీ జెండాను ఎత్తుకుందాం. గులాబీ జెండానే తెలంగాణకు రక్ష. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ముందుకు దూసుకొని పోవాలి. ఎవడో నలుగురుపోతే మనకు పోయేదేం లేదు. ఉన్న కార్యకర్తలు ధైర్యంగా ప్రజాశక్తిని కూడగట్టుకొని ముందుకుపోయి అద్భుతంగా విజయాన్ని సాధిద్దాం.
చేనేత కార్మికులకు మనవి చేస్తున్నా.. మీరు బతకాలంటే మీ తరుపున కొట్లాడేవాళ్లు అసెంబ్లీలో ఉన్నారు. పార్లమెంట్లో కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఓటు తమాషాకు వేయొద్దు.. మొన్న కొంతమంది తమాషాకు ఓటు వేశారు. కరెంట్ బాగైంది, మంచినీళ్లు బాగైనయి, రైతుబంధు వస్తుంది ఇగ బాధలేదు అనుకొని వీడేమో ఎక్కువ ఇస్తమనగనే దురాశకు అటు చెయ్యి చాపారు. ఏమైంది? వాళ్లు మంచిగా పదవుల్లోకి ఎక్కారు, బ్రహ్మాండంగా ఉన్నారు. డబ్బుల మూటలు గుంజుతున్నరు.
దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నరు. ఢిల్లీకి మళ్లీ సూట్కేసులు పంపుతున్నరు. వాళ్లంతా ఆ పనులపై బాగా బీజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగుడు. మూన్నెళ్లలో తొమ్మిదిసార్లు ఢిల్లీకి పోతరా? ఇన్ని యాత్రలా? ఏం జరుగుతున్నది? మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిలీ పెద్దల గద్దల పాదల దగ్గర తాకట్టు పెట్టి మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగాలా? లేక ప్రజల పక్షాన గళం వినిపించి పోరాటం చేసే నాయకులు పార్లమెంట్కు పోవాలా? ఏదో ఆలోచించాలి.
బీఆర్ఎస్ ఒక అంకుశం మాదిరిగా ఉండాలి. బీఆర్ఎస్ బలం.. తెలంగాణ బలం. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గళం. శాసనసభలో గానీ, పార్లమెంట్లో గానీ అన్ని విధాలా ఇటు రాష్ర్టాన్ని, అటు కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి పని చేయించాలంటే బీఆర్ఎస్ ఉండాలే. మా ఎమ్మెల్యేలు నా వద్దకు వస్తే నేను ఒక్కటే చెప్పినా… ‘వాళ్లు గెలిచారు. మూడు నాలుగు నెలల వరకు వాళ్లను పని చేయనివ్వండి. వాళ్ల వ్యవహారమేందో చూద్దాం. వాళ్లకు అధికారం వచ్చిందని ఈర్ష్య పడ్డట్టు అక్కసుతో ఉండొద్దు. వాళ్లను వదిలిపెడదాం.
నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలుపెడదాం’ అని చెప్పిన. ఒక్కటంటే ఒక్క మాటమీదైనా ఖాయం ఉండొద్దా? ‘ఉరుకుర్రి.. ఉరుకుర్రి.. 2 లక్షల రుణం తెచ్చుకోండి. డిసెంబర్ 9నాడే మాఫీ చేస్తా’ అని కాంగ్రెస్ చెప్పింది. కానీ చేయలేదు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి. ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చినోళ్లు, పేగులు తెగేదాకా కొట్లాడినోళ్లు, చావు అంచులదాకా వెళ్లి చావునోట్లో తలకాయ పెట్టినోళ్లకు తెలంగాణ గురించి కడుపునొప్పి ఉంటది. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతున్నా.. నేను చెప్పే మాటలపై ఆలోచన చేయాలి.