KCR | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు సీటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు.
శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోశ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దవాఖానకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరూ దవాఖానకు రావొద్దని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. దవాఖాన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కింద పడటంతో తుంటి ఎముక విరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ దవాఖాన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కోసం అందరూ ఇంటి వద్దే ప్రార్థన చేయాలని కోరారు. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనేందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, దానం నాగేందర్, జీవన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఫారుఖ్ హుస్సేన్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, దాసోజు శ్రవణ్, రామచంద్ర నాయక్, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు దవాఖానకు వచ్చారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా యశోద దవఖానకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శుక్రవారం యశోద దవాఖానకు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కొందరు ట్వీట్ చేయగా, మరికొందరు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేసీఆర్ గాయపడిన విషయం తెలిసి బాధపడ్డానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందజేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. ఏపీ సీఎం జగన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు కేటీఆర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. కేసీఆర్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, చంద్రబాబు, లోకేశ్, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, సినీ నటుడు చిరంజీవి ఆకాంక్షించారు.