CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభకు హాజరై.. ప్రసంగించనున్నారు. సభకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
హిందువులు, ముస్లింలు అని పంచాయితీలు పెట్టే దుర్మార్గులు ఉన్నారు. మన రాష్ట్రం అటువంటి కాదు. కలిసి ఉన్నాం. వందల సంవత్సరాలు సహజీవనం చేశాం. మొన్న మిలాద్ ఉన్ నబీ.. వినాయక నిమజ్జనం ఒకే రోజు వస్తే ముస్లిం పెద్దలు మిలాద్ ఉన్ నబీ వేరే రోజున పెట్టారు. ఇది గంగా జమున తెహజీబ్. ఇది సంస్కారం. ఇది భారతదేశానికే గొప్ప ఉదాహరణగా నిలిపిన ముస్లింలు, హిందూ సోదరులందరూ అభినందనీయులు. మనం అదే కీర్తిని కాపాడుకోవాలని కోరుతున్నా. మీ వద్ద మంచి నేత ఉన్నాడు. మరోసారి కేటీఆర్ను దీవించి.. కారు గుర్తుకు ఓటేసి గెలిచించాలని విజ్ఞప్తి చేస్తున్నా..
కరెంటు 24గంటలు కావాలా.. మూడు గంటలు కావాలా..? రాష్ట్రంలో మొత్తం ఎక్కడ అడిగినా 24 గంటల కరెంటు ఉండాలంటున్నారు. 60 సంవత్సరాలు పాలించినా కడుపునిండా కరెంటు ఇవ్వలేదు. తెలంగాణలో 24 గంటలు కరెంటు వస్తుంది. కేసీఆర్ మొండి పట్టుదలతో ఇది సాధ్యమైంది. నరేంద్ర మోదీ బాయిడకాడ మీటర్లు పెట్టకుంటే నిధులు కట్ చేస్తామంటే.. మలిచిపెట్టుకో.. నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు పెట్టలేదు. ఇవన్నీ సత్యాలే. నిబద్దతతో రైతాంగం బాగుపడాలి. అన్ని వర్గాలు బాగుండాలనుకుంటున్నాం. మనకు జాతి, కులం, మతం లేదు.
ధరణి పోర్టల్ను తీసుకువచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. వారి ఆస్తి కింద ఉండాలి. కౌలుకు ఇచ్చినా ఇంకొకరి పరం కాకుండా ఉండేందుకు ధరణి పోర్టల్ను తీసుకువచ్చాం. గతంలో రిజిస్ట్రేషన్ ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో మీ కండ్ల ముందుంది. కాంగ్రెస్ పార్టీ గొడ్డలి భుజం మీద పెట్టుకొని రెడీగా ఉంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు, కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. మళ్లీ వీఆర్వోలు, గిర్దావర్లు వస్తరు. రైతులను కోర్టుల చుట్టు తిప్పేందుకా? ప్రభుత్వంలో వివిధ స్థాయిలో అధికారాన్ని తీసి రైతులకే ఇచ్చాం. మీ బొటనవేలి ముద్ర లేకుండా ఇవాళ గిర్దావరి, ఎమ్మార్వోకు, చివరకు సీఎం కూడా అధికారం లేకుండా చేశాం. రైతులకు ఇచ్చిన హక్కులు మారాలంటే బయోమెట్రిక్తోనే మారుతుంది.
ఒక మేరాయన ఒక ఇంట్లో బట్టలు కడుతున్నారు. వేములాడ రాజన్న నా సూది నాకు దొరకనియ్యి. నీకు పేరుమీద కిలో చెక్కెర పంచి పెడతా అని మొక్కిండట. భార్య ఇంట్లో నుంచి ఉరికి వచ్చి.. బాగానే ఉంది.. పది పైసల సూదికి కిలో చెక్కర పంచుతవా అని అడిగితే.. సూదైతే దొరకని.. చక్కెర ఎగబెడుదాం.. దేవుడే ఏం చేస్తడు అన్నడట. అట్లుంటది ఆపద మొక్కలు మొక్కే వారి పరిస్థితి
సిరిసిల్లలో ఏం జరిగిందో రామారావు చెప్పాడు. రామారావు గొప్పోడు అని పొడిగితే నన్ను పొగుడుకున్నట్లు ఉంటది. రామారావు గుణం, గణం ఏంటో మీకే తెలుసు. రామారావును పొగిడే అవసరం లేదు. రావాల్సినవి వచ్చాయి. భవిష్యత్లో విద్యాకేంద్రంగా, అకాడమిక్ సెంటర్గా నిలుస్తుంది. నీళ్లు కూడా పుష్కలంగా వచ్చాయి. సిరిసిల్ల ప్రాంతానికి అన్ని హంగులు, జిల్లాకు ఏర్పడే విధంగా హామీ ఇస్తున్నా. ఆపదమొక్కలు మొక్కే వారు వస్తారు.
కొందరు రాజకీయాలు చేసే చిల్లగాళ్లు ఉంటారు. ఉన్నరని చిన్నబోవద్దు. మరమగ్గాలు నడవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుల సందర్భంగా కార్మికులకు పని కల్పించేందుకు చీరెలను తీసుకువచ్చాం. దాన్ని కూడా కొందరు దుర్మార్గులు ఆ చీరెలను కాలబెట్టి గీ చీరెలు ఇస్తారా అంటున్నారు. ఆ చీరెలను ఉరివేసుకొని చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచేందుకు తీసుకువచ్చిన పథకం అది.
సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్గా గెలువడం మీ అదృష్టం
సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్గా గెలువడం మీ అదృష్టం. చేనేత కార్మికుల కోసం ప్రతిసారి నాతోటి పోరాటం చేసి.. చేనేత కార్మికులు, మరమగ్గాల ఆధునికీకరణ కోసం డబ్బులు తెచ్చి.. సిరిసిల్ల కార్మికుల పరిస్థితిని, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని నుంచి చల్లగా బతికే పరిస్థితి తెచ్చినందుకు రామారావును అభినందిస్తున్నా. షోలాపూర్ ఎలాగైతే ఉంటదో.. సిరిసిల్ల అలా కావాలని పెద్దలు కోరుకుంటున్నారు. భవిష్యత్లో ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారు. మీకు హామీ ఇస్తున్నా. మీ ఆశీస్సులతో మరోసారి మనమే గెలువబోతున్నాం. తప్పకుండా చేనేత కార్మికుల అవసరలన్నీ తీర్చేందుకు నేను, ప్రభుత్వం మీ వెంట ఉంటదని హామీ ఇస్తున్నా.
తెలంగాణ ఉద్యమ సమమంలో ఒకరాత్రి వేరే నియోజకవర్గంలో మధ్యరాత్రి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాం. రాత్రి కారు హెడ్లైట్ల వెలుతురులో ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావకండి అనే రాతలు చూసి ప్రొఫెసర్ జయశంకర్, నేను కండ్లకు నీళ్లు తీసుకున్నాం. 70 స్వాతంత్య్రంలో, ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు బాధలు అని బాధపడ్డాం. ఇక్కడ ఎంపీగా వచ్చిన సమయంలో సిరిసిల్లలో ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఈ ఆత్మహత్యలు నన్ను కలిచివేశాయి. నేను కూడా ఎంపీగా ఉన్న సమయంలో సిరిసిల్ల పెద్దలకు ఫోన్ చేసి.. పార్టీ రూ.50లక్షల పార్టీ ఫండ్ను సమకూర్చి సిరిసిల్లలో సభ పెట్టి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి వెళ్లాను.
నిజంగానే ఇప్పుడు హెలికాప్టర్లో వస్తుంటే ఒక సజీవ జలధారగా అప్పర్ మానేరు మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. చిన్నప్పుడు సైకిల్ మోటర్పై వస్తున్న సమయంలో 40-50 ఏళ్ల కింద మానేరు నదిలో ఒకపాయలా నీళ్లు కనిపించేవి. సమైక్యపాలనలో మొత్తం నాశనమై.. దుమ్మలేచే పరిస్థితి వచ్చింది. ముస్తాబాద్ మండలంలో పోత్గల్పై గూడూరు గ్రామం ఉంటుంది. ఊ ఊరికి మా అక్కను ఇచ్చాం. అక్కడ అప్పర్మానేరు కాలలో కొన్ని నెలల తరబడి నేను ఈ కొట్టిన. నా కండ్ల ముందే పోత్గల్ గ్రామంలో 10-15 రైస్మిల్లు వచ్చాయి. ఉమ్మడిపాలనలో నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా.. అవన్నీ మాయమయ్యాయి. అప్పర్ మానేరు అడుగంటి పోయింది.
ఉమ్మడిపాలనలో నేతన్నల ఆత్మహత్యలతో ఉరిశాలగా మారింది. సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయి. బతుకులు మారాయి. ఇది నేతల ప్రభుత్వం, నేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. కలలో కూడా ఊహించని విధంగా జిల్లా అయ్యింది. ఎక్కడో కరీంనగర్లో ఉండే జిల్లా అధికారులను కలిసి వెళ్లడానికి బాధలు తప్పినయ్ అని కేటీఆర్ అన్నారు.
కలలో కూడా ఊహించని సంక్షేమం, కలలో కల్పన కూడా చేయలేనంత అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండంగా మన కండ్ల ముందు కనబడుతున్నది. ఎర్రటి ఎండల్లో, ఏప్రిల్ నెలలో ఎగువ మానేరు మత్తడి దుంకుతుందంటే దానికి కారణం సీఎం కేసీఆర్. గోదావరి జలాలు కాళేశ్వరం ద్వారా మల్లన్న రిజర్వాయర్ ద్వారా మన బీళ్లకు మళ్లుతున్నయంటే దానికి కారణం సీఎం కేసీఆర్. నెత్తురు బారిన, నెర్రలు బారిన ఈ నేలలో మొట్టమొదటి సారి నీళ్లు చూస్తున్నాం. కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాళ సాగు, తాగునీరు ఒక వైపు పుష్కలంగా వస్తున్నయ్.
రాజన్న సిరిసిల్లలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సిరిసిల్లకు చేరుకున్న సీఎం కేసీఆర్కు గులాబీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత హెలిప్యాడ్ వద్ద నుంచి బహిరంగ సభ స్థలానికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు జై తెలంగాణ నినాదాలతో ఘన స్వాగతం పలికారు.
గుర్తును గుర్తుంచుకో.. గులాబీల జెండా.. అనే పాటను మధుప్రియ పాడి బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. సభలో ఉన్న కార్యకర్తలంతా పైకిలేచి.. గులాబీ జెండాలు ఎగురేశారు. ప్రతి పాటకు కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిరిసిల్లకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్లకు వచ్చారు. కొద్దిసేపట్లో ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి చేరుకొని.. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
కండ్లు మండుతున్నయ్ కాంగ్రెసోళ్లకు.. ప్రతిపక్షపోళ్లకు అని కళాకారులు పాడిన పాటకు మహిళలు నృత్యాలు చేశారు. గులాబీ జెండాలు ఎగురవేస్తూ.. కేసీఆర్కు జై కొట్టారు. జై కేటీఆర్ అంటూ నినదించారు. ఆసరా పెన్షన్ అందుకుంటున్న మహిళలు గులాబీ కండువాలు ఎగురవేస్తూ.. బీఆర్ఎస్కు మద్దతు పలికారు.
రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేరుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహినికి అభివందనం చేశారు.
సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం ఆటపాటలతో హోరెత్తింది. ప్రముఖ సింగర్ మధు ప్రియ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన పథకాలను పాటలతో కార్యకర్తలను హోరెత్తించారు.