హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు. హామీలను అటకెక్కించి పాగల్ పనులతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4 నెలల్లో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, ప్రజల సమస్యలను వివరించారు. తొమ్మిదేండ్లు బ్రహ్మాండంగా నడిచిన కరెంటు ను, ఆరేండ్లు నడిపిన మిషన్ భగీరథను నడిపే తెలివితేటలు ప్రభుత్వానికి లేకుండా పోయాయని దుయ్యబట్టారు. రైతుల నుంచి మహిళల వరకు అందరినీ మోసం చేశారని ఆరోపించారు. ఇదా రాజ్యం నడిపే తీరు? అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇయ్యాలె. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలె. మేం జొన్నలు కొనం, అవి కొనం అంటే కలవదు బిడ్డా. లేకపోతే రైతులు పులుల్లాగా మీ గొంతు కరిచి చంపుతరు జాగ్రత్త.
-కేసీఆర్
ఎన్నికలకు ముందు సీఎం ఏం చెప్పిండు. ఉరుకుండ్రి, లగెత్తుండ్రి, జల్దీ తెచ్చుకోండ్రి, మంచి సమయం మించిన దొరకదు అన్నట్టు అర్రాస్ పాటపాడిండు. డిసెంబర్ తొమ్మిదినాడే సంతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నడు. డిసెంబరు 9 పోయి ఎన్నిరోజులైంది. బ్యాంకు అధికారులు వచ్చి డబ్బులు కట్టమని రైతులకు నోటీసులిస్తున్నరు. రాజకీయ నేతల ప్రకటనలతో మాకు సంబంధం లేదంటున్నరు. మరి రైతుల గతి ఏం కావాలె? వ్యవసాయం సంక్షోభానికి గురయ్యే పరిస్థితికొచ్చింది. ఉలుకు పలుకు లేదు. ఏం చేస్తరో చెప్పరు. రుణమాఫీ సంగతేంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలె? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? వెంటనే తేల్చాలె. లేదంటే వేటాడుతం, వెంటాడుతం. లత్కోరు వాగ్దానాలు చేసి ఇష్టంవచ్చినట్టు నోటికి ఎంతవస్తే అంత చేప్పిండ్రు. బ్యాంకుల నుంచి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలె.
అన్ని పంటలు మొత్తం కొంటం. అన్నిటికీ బోనస్ ఇస్తమన్నరు. ఈ రోజు పత్రికల్లో చూస్తే జొన్నపంట సగం కొంటరని వచ్చింది. పోయినపంట పోయింది. ఉన్నపంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. వానకాలం వడ్లకు బోనస్ ఇవ్వలే. క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తమన్నరు, రూపాయి ఇవ్వలే. కొనుగోలు కేంద్రాలు పెట్టినమని చెప్పిండ్రు. బోనస్ ఇవ్వకపోతే మీరు బోగస్ అని కర్రుకాల్చి వాతపెడతరు. దీనికేం కోడ్ అడ్డంకి కాదు. చిత్తశుద్ధి ఉం టే ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయాలి. కానీ రాయరు. మే 13న పోలింగ్ పూర్తయితది. ఆ తర్వాత ఏరైతుది ఎంతుందో తీయండి.పరిహా రం కట్టివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు.
కల్యాణలక్ష్మితో తులం బంగారం కలిపిస్తమని వాగ్దానం చేశారు. ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మార్కెట్ల తులం బంగారం దొరుకతలేదా? మూడు, నాలుగు తారీకుల్లో విపరీతమైన పెండిండ్లు అయినయి. తులం బంగా రం వస్తదని ఆశపడ్డరు. మీకు ఓట్లు కూడా వేశారు. మీకు తులం బంగారం దొరుకతలేదా? ఇది కూడా రెఫరెండం కిందికే వస్తది.
మీరొచ్చి ఇప్పటికి నాలుగు నెలలైంది. ప్రతి వృద్ధాప్య పింఛన్ మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎగనామం 24వేలు. వాళ్లకు 24వేలు కట్టిచ్చేదాకా వెంటాడుతం. ఇదేనా రెఫరెండమని వృద్ధాప్య పింఛన్దారులు కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెట్టాలి.
-కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మీ మహత్తరమైన ఇందిరమ్మ రాజ్యంలో రెండువందల పింఛన్ ఉండే. వృద్ధాప్య పింఛన్ను మేం రెండు వందల నుంచి రెండువేలు చేసినం. రాష్ట్రంలో దాదాపు 30లక్షల వృద్ధాప్య పింఛన్లున్నాయి. మేం రెండువేలిస్తే, మీరు నాలుగువేలేస్తమని ఎన్నికలకు ముందు హామీనిచ్చారు. ఇంట్లో ముసలమ్మ, ముసలాయన ఇద్దరుంటే ఇద్దరికీ తలా నాలుగువేలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎంత మందికి నామం పెట్టిండ్రు అన్నది ప్రజ లు ఆలోచించాలి. ఒక నెల పింఛన్ ఎగవెట్రిం డ్రు. రెండోది నాలుగువేలిస్తలేరు. ఇది చాలక సిగ్గులేక మీ పరిపాలనకు రెఫరెండమంటారా? 30 లక్షల కుటుంబాలకు పాత రెండువేలు మినహాయిస్తే, డబుల్ ఇచ్చేది కలుపుకొంటే ఒక్కో ఇంటికి మీరు ఆరు వేలు బాకీ ఉన్నరు.
గొర్రెల యూనిట్ల కోసం యాదవ సోదరులు వందలకోట్ల రూపాయలు కట్టారు. ఆ యూనిట్లు ఇస్తరన్న ఆశతో ఉన్నారు. గొర్ల యూనిట్లు బంద్. ఇస్తరా, చస్తరా.. ఏం చేస్తరో చెప్పరు. కాంగ్రెస్ను శిక్షించేందుకు యాదవ సోదరులు రెడీగా ఉన్నారు. దళితబంధును మేం 1.30 లక్షలమందికి శాంక్షన్చేసినం. మేం పదిలక్షలు ఇచ్చేవాళ్లం. మీరు 12 లక్షలిస్తమని వాగ్దానం చేసిండ్రు. మేం రిలీజ్ చేసిన డబ్బులు ఫ్రీజ్ చేసిపడేసిండ్రు. ఈ మొండి మొద్దునిద్రపోయే సర్కారుకు బడితెలు పట్టుకుని వాయించడమే కరెక్టు. పార్లమెంట్ ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గ్రామగ్రామాన దళిత సోదరులు గీతగీసి నిలదీయండి. ఈ మోసంపై ఈ లక్షా ముప్పైవేల దళితపులులు ఎక్కడిక్కడ గర్జించాలె.
మీ సమర్థత ఏంది? మీ శక్తి ఏంది? మీ తెలితేటలు ఏంది? మీరు ఎంతపాటి సిపాయిలు అనేది కాలమే రుజువు చేస్తది. ఒక్క ఏడాదిలోనే మీ రంగు తేలుతది.
-కేసీఆర్
హైదరాబాద్లో మళ్లా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయి? ప్రజలు ట్యాంకర్లను ఎందుకు కొంటున్నరు? ఆ ఖర్మ ప్రజలకు ఎందుకు పట్టింది? గవర్నమెంట్ కచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము హైదరాబాద్లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చినం. ఇయ్యాల ప్రజలకు బిల్లులు వస్తున్నయి. పైగా ట్యాంకర్లు కొనుక్కోవాలి. ప్రభుత్వ పెద్దలారా.. రెఫరెండం అని మీరు అన్నరు కాబట్టి చీము, నెత్తురు, ఏమైనా పౌరుషం ఉంటే హైదరాబాద్ ప్రజలు కర్రుకాల్చి మీకు వాత పెట్టక ముందే మేల్కోండి. ట్యాంకర్లు ఫ్రీగా సప్లయ్ చేయండి.
అన్నింటినీమించి సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే.. రాష్ట్రవ్యాప్తంగా పేదల అందరి ఇండ్లలో నల్లా ఉండాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చినం. మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ మొఖానికి ఎన్నడూ ఇయ్యలే. పేదల కోసం నేను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టించిన. రోడ్ల మీద లేకుండా చేసినం. బిందెలు కనబడకుండా చేసినం’ అని కేసీఆర్ చెప్పారు.