KCR | కరీంనగర్ జిల్లా దీవెనతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకో మాట తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇది మామూలు గడ్డ కాదు. నేను తెలంగాణ గులాబీ జెండా పైకెత్తిననాడు.. ఇదే గడ్డపై ఎస్సారార్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంత ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చైతన్యం ఉన్న గడ్డ’ అన్నారు.
‘ఒకనాడు కాంగ్రెస్వాళ్లు నన్ను అవమానించి నువ్వేమాతోని గెలిచినవ్ అంటే.. నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపించాలని రాజీనామా చేస్తే.. ఉప ఎన్నిక వచ్చి పోటీ చేస్తే 2.50లక్షల మెజారిటీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ మరిచిపోలేనటువంటిది. ఆ గౌరవం నాకున్నదని మనవి చేస్తున్నా. చైతన్యవంతమైన గడ్డకాబట్టి ఒక మాట అప్పీల్ చేస్తున్న. దేశంలో విద్యా చట్టం అమలులో ఉన్నది. ఇండియాలో ఎన్ని జిల్లాలు ఉంటే.. ప్రతి జిల్లాకో కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం.. కానీ చట్టాన్ని కూడా ఉల్లంఘించి మోదీ.. 150 ఉత్తరాలు నేను రాసిన. వంద సార్లు అడిగిన. అయ్యా మేం కొత్త రాష్ట్రం అయినం. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు’ అంటూ విమర్శించారు.
‘దేశంలో నరేంద్ర మోదీ 150 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటీ మన తెలంగాణకు ఇవ్వలేదు. కొత్తవాళ్లం ప్రాజెక్టుకు కట్టుకుంటున్నం. ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే.. ఇవ్వలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోదీ నా మెడపై కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలే. లేకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్లు కట్ చేస్తా అన్నడు. ఆ రోజు నేను చెప్పిన. నా రాష్ట్రం నాకు తెలుసు. నా రైతుల బాధలు నాకు తెలుసు. నువ్వు నన్ను సంపినా సరే.. తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వు ఏం చేసుకుంటవో చేసుకో.. నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మీ అందరికీ తెలుసు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా. మీ అందరూ విన్నారు. మీ అందరినీ ఒక్కటే కోరుతున్న’ అన్నారు.