ఎల్బీనగర్, జూలై 17: యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శుక్రవారం సరూర్నగర్ స్టేడియం సభా ప్రాంగణం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్యాదరి బాలమల్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి వారు మాట్లాడారు. సభకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం , పోలీస్ యంత్రాలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు హైకోర్టు అనుమతితో తొలగిపోయాయన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఆగ్రహంతో ఉన్నారన్న నెపంతో వారి శాంతియుత పోరాటాలకు కూడా అడ్డుతగులుతోందని విమర్శించారు. సభ అనుమతులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మొదలుకుని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డీఎస్డీవోకు లేఖలు ఇచ్చామని, అయితే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పరిధిలోకి వస్తున్నందున కమిషనర్కు నేరుగా అనుమతి కోసం లేఖ ఇవ్వాలని కోరగా అక్కడ కూడా ఇచ్చి 18 రోజులు గడిచినా రోజుకో కొర్రీ పెడుతూ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా యువత, నిరుద్యోగులు తరలివస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం తెలుసుకుని అనుమతులు రాకుండా సీఎం రేవంత్రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా హైకోర్టు అనుమతితో సభను నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో గురువారం నిరుద్యోగ జేఏసీ నాయకులు తమ హక్కులను కేబినెట్ సమావేశం దృష్టికి తెచ్చేందుకు దిల్సుఖ్నగర్లో శాంతియుత ర్యాలీ చేస్తుంటే వారిపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జి చేసి వాహనాల్లో పడేసి నాగోలు పోలీస్స్టేషన్కు తరలించారని ఆరోపించారు.
సభకు అనుమతి ఇచ్చేందుకు సీఎం భయపడుతున్నారని, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉన్నందున కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారని భయపడుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువత విషయంలో పిచ్చి చేష్టలు చేస్తే యువత తిరగబడుతుందని వారు హెచ్చరించారు. ఉద్యోగం కోసం అడిగిన యువతను పురుగుల మందు తాగాలని చెప్పిన సీఎం రేవంత్ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ విద్యార్థులు వస్తారన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 16న ఉన్న పరీక్షను సభ ఉన్న జూలై 18వ తేదీకి వాయిదా వేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీతో సెంట్రల్ లైబ్రరీ వద్ద, ప్రియాంక గాంధీతో ఇదే సరూర్నగర్ మైదానంలో అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందన్నారు.