KCR | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే నాటి ఉద్యమ కాలం నుంచి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. అదే సైద్ధాంతికతో భావ సారూప్యతతో పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తును ప్రజలు హర్షిస్తారని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే సానుకూల స్పందన వస్తున్నదన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవాలన్నారు. కలిసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలని.. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే దీర్ఘ కాలిక లక్ష్యంతో కూడుకుని ఉన్నదన్నారు. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఆ దిశగా పదేండ్ల పాటు అనుసరించిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతామన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీఎస్పీలు కలిసికట్టుగా పనిచేసి ప్రజా అభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తామని కేసీఆర్ అన్నారు. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. కాగా, బీఎస్పీతో పొత్తును సమావేశం హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో ఏకీభవించింది. తన ప్రయత్నానికి మద్దతు ప్రకటించిన పార్టీ నేతలకు అధినేత ధన్యవాదాలు తెలిపారు.