BRS Party | బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఎయిర్పోర్ట్ నుంచి సభావేది వరకు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ హోర్డింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నాందేడ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అయిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాందేడ్ గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ మహారాష్ట్ర, తెలంగాణ నాయకులు, గులాబీ శ్రేణులు సమష్టిగా కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు.
బాబ్లీ పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామాలు ఆడారని గుర్తుచేశారు. అసలు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా వివాదం ఎక్కడిదని అన్నారు. మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం పూర్తయిందని తెలిపారు. మందిర్, మసీద్, చర్చి విషయంలో మాది ఒక్కటే విధానమని స్పష్టం చేశారు. మేం మహారాష్ట్రకు హృదయపూర్వకంగా ఉంటామని.. వాళ్లకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడ నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని తెలిపారు.
బీజేపీ మతతత్వ రాజకీయాలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తే ఎన్నికల్లో సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆంక్షలు అమల్లోకి వస్తాయని, దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ మిషన్ మోడ్లో పని చేస్తుందని, దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు.
పేదలను దోచి కొద్ది మంది మిత్రులకు లాభం చేకూర్చడమే మోదీ విధానం అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఎల్ఐసీని ఎందుకు అమ్ముతోందని నిలదీశారు. ఎల్ఐసీతో అదానీ సంస్థల్లో 87 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించారని చెప్పిన ఆయన.. ఎల్ఐసీకి నష్టం జరగలేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. అదానీ దెబ్బకు వారంలోనే జనాల సొమ్ము 10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా అదానీ స్కామ్పై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటులోఎందుకు సమాధానం చెప్పట్లేదని నిలదీశారు. అదానీ మీ మిత్రుడు అందుకే కాపాడుతున్నారని విమర్శించారు. అదానీ అంత వేగంగా ఎలా ఎదిగారో సమాధానం చెప్పాలన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. చైనా నుంచి చాలా కంపెనీలు వెళ్లిపోతున్నాయని, ఆ కంపెనీలు భారత్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఫైజర్ సంస్థతో తాను స్వయంగా మాట్లాడానని అన్నారు. కేంద్ర వైఫల్యం వల్లే అలాంటి కంపెనీలు భారత్కి రావడానికి ఆసక్తి చూపిండం లేదన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని కేసీఆర్ అన్నారు. మహిళలను కేంద్ర చిన్న చూపు చూస్తోందని, మహిళల ప్రాతినిథ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెంచుతామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, మండలితో పాటు పార్లమెంట్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇది అమలు చేస్తామన్నారు. హథ్రాస్ ఘటన మహిళలకు రక్షణ లేదని నిరూపించిందన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మాటలకే పరిమితమైందన్నారు.
కిలో బొగ్గును కూడా దేశం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని, కావాలనే కోల్మైన్స్ ప్రాంతాలకు కేంద్రం కొత్త రైల్వే లైన్లు వేయడం లేదన్నారు. విదేశాల నుంచి బొగ్గును ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఉండాలి కదా అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అడ్డంగా అమ్మేస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రవేట్ పరం చేయకూడదని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని అన్నారు. కానీ కేంద్రం అంబానీ, అదానీ, జిందాల్ పాటు పాడుతోందంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసినా బీఆర్ఎస్ తిరిగి జాతీయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్లో కరెంట్ కోతలుండవిని అన్నారు. భారత్ను వెలిగిపోయేలా చేస్తాం అన్నారు.
హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చామన్న కేసీఆర్.. న్యూయార్క్లో కరెంట్ పోయినా హైదరాబాద్లో కరెంట్ పోదన్నారు. అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడుతోందన్న కేసీఆర్.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుముప్పు అని అన్నారు. ఇలాంటి కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.
దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అన్ని ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ ఏవీ ఉండవని మండిపడ్డారు. రోడ్లు సరిగ్గా ఉండవు.. రైళ్లు సరిగ్గా ఉండవు.. షిప్ యార్డులు.. ఎయిర్పోర్టులు ఏవీ సరిగ్గా ఉండవని అన్నారు. ఏమన్నా అంటే ఎకానమీ గురించి సిగ్గులేకుండా మాట్లాడతారని విమర్శించారు. ఇండియాలో గూడ్స్ రైలు స్పీడ్ను గమనించండి.. గూడ్స్ రైలు 24 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.. అదే చైనాలో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ఇంకెప్పుడు మనం చైనాతో పోటీపడతామని ప్రశ్నించారు. ఇది సాధ్యమేనా అని నిలదీశారు.
అమెరికాలో 78 కిలోమీటర్ల స్పీడ్, యూకే 75 కి.మీ. ఆస్ట్రేలియా 80, జర్మనీలో 60 కిలోమీటర్లు వేగంతో గూడ్స్ రైళ్లు వెళ్తాయని.. మన దేశంలో మాత్రం 24 కి.మీ. స్పీడ్తోనే వెళ్తున్నాయని చెప్పారు. ఇండియాలో ట్రక్కులు 50కి.మీ. స్పీడ్తో వెళ్తాయి. అదే జపాన్ 60, దక్షిణ కొరియా 80, అమెరికా 115 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి. ఇంకెప్పుడు విదేశాలతో పోటీపడతామని నిలదీశారు. అభివృద్దికి బదులు ధర్మం, జాతీయవాదం పేరు చెప్పుకుంటూ ప్రజల్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. ఎలా అయితే దేశం ఎటు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో పరివర్తన కోసం ముందుకొచ్చామని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వేల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయని, అలాంటివి మన దేశంలో అవసరం లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 3 గంటలు కూడా ఉండటం లేదన్నారు. విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధి ఇండెక్స్కి ప్రమాణికం అని అన్నారు. ఇందులో భారత్లో పరిస్థితి ఎందుకు మారడం లేదన్నారు.
75 ఏళ్లుగా దేశంలో రైతుల పరిస్థితి మారడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి సిగ్గుచేటన్నారు. నానాపటేకర్ లాంటి నటులు రైతులకు సాయం చేస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల స్వత్రంత్రం తర్వాత కూడా దేశ రాజధాని ఢిల్లీలో తాగునీరు దొరకడం లేదన్నారు. దేశంలో ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్లు సరిగా లేవన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశం జింబాబ్వేలో ఉంది. ఈజిప్టు, కొలంబియా, చైనా, అమెరికాలో భారీ రిజర్వాయర్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంత పెద్ద భారత దేశంలో ఒక్కటంటే ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా ఎందుకు లేదు. అని ఆయన ప్రశ్నించారు. దేశం జలవిధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వాటర్ పాలసీని మార్చడానికి ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదన్నారు.
దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అవసరానికి మించి జల సంపద ఉందన్నారు. భారత్ కంటే విస్తీర్ణంలో అతి చిన్న దేశాలైన సింగపూర్, జపాన్, మలేషియా, సౌత్ కొరియా కూడా అభివృద్ధిలో దూసుకెళుతున్నాయన్నారు. రోటిన్కు భిన్నంగా పనిచేసినప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జలవిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు. భారత్లో అవసరానికి మించిన జల సంపద ఉందని అన్నారు. అయినా జల యద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో మేధావులు ఆలోచించాలని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. ట్రైబ్యునళ్లు, అనుమతుల పేరుతో కాలయాపన చేస్తున్నారని, నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య ఎన్నాళ్లీ యుద్ధాలు అని ప్రశ్నించారు. మహానది, కావేరి, గోదావరి నదుల మధ్య నీళ్ల కోసం పంచాయతీలు ఎందుకు అని ప్రశ్నించారు.
నాందేడ్లో బహిరంగ సభ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ అవతరించిందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో నీటికోసం యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని విలేకర్ల సమావేశంలో కేసీఆర్ ప్రశ్నించారు. నీటి కొట్లాటలపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దేశంలో నీటి వనరులకు కొదవ లేదు. అవసరానికి మించి ఉన్నాయని చెప్పారు. నీటిపై తాను సొంత లెక్కలు చెప్పడం లేదని కేంద్ర జలశక్తి చెప్పిన లెక్కలేనని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర రావాలని.. నాందేడ్లో గొంతు వినిపించాలని ధర్మాబాద్కు చెందిన బాపురావ్ కదం, యువమిత్రుడు గణేశ్ కదం తనను చాలా రోజులుగా అడిగారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. తన కోసం చాలామంది అక్కడ ఎదురుచూస్తున్నారని చెప్పారని.. కానీ తనను ఆశీర్వదించేందుకు ఇంతమంది వస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరిచిపోనని తెలిపారు. మహారాష్ట్రలో ఇదే తన తొలిసభ అని తెలిపిన ఆయన.. కొద్దిరోజుల్లోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యచరణ ప్రారంభిస్తానని వెల్లడించారు. రైతుల కోసం మాణిక్ కదమ్ చాలా ఏళ్లుగా పోరాడుతున్నాడు.. దశరథ్ సావంత్ 84 ఏళ్ల వయసులోనూ రైతుల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. వీళ్లు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని తెలిపారు.
పదిరోజుల్లోనే ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ వాహనం వెళ్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఊరూరా తిరిగి రైతులను ఏకం చేస్తూ కిసాన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు ఒకేసారి 288 వాహనాలు బయల్దేరతాయని ఆయన స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి నుంచే కిసాన్ కమిటీ ఏర్పాటు కోసం ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. కేవలం నాందేడ్ మాత్రమే కాదని.. మహారాష్ట్రలోని నలువైపులా వెళ్లి ప్రచారం చేస్తానని అన్నారు. పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఉత్తర మహారాష్ట్రలో పర్యటిస్తానని చెప్పారు. భగవంతుడు ఇచ్చిన శక్తిమేరకు తిరిగి అందర్నీ సంఘటితం చేస్తానని తెలిపారు.
ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు!
ప్రాణీషు సద్బవనాస్తు.. విశ్వస్య కళ్యాణమస్తు !!
జై మహారాష్ట్ర.. జై భారత్.. జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
మహారాష్ట్రలో ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ రైతులకు రూ.10వేలు ఇవ్వరని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 నెలలు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని ఆరోపించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే నాకోసం చనిపోయారా? అని ప్రధాని ప్రశ్నించడం చాలా బాధకరమైన విషయమని అన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే.. ప్రధానికి చేతులు రాలేదని అన్నారు. ఫసల్ బీమా అనేది జూటా అని విమర్శించారు. మద్దతు ధర కోసం చక్కెర ఫ్యాక్టరీల దగ్గర ప్రతి సంవత్సరం ధర్నాలు చేయాలా అని ప్రశ్నించారు.
మన కిసాన్ సర్కార్ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయని సీఎం కేసీఆర్ అన్నారు. గులాబీ సర్కార్ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంటు వస్తుందని తెలిపారు. తెలంగాణలో కరెంట్ విషయంలో నిరూపించామని.. దేశమంతా సుసాధ్యం చేస్తామని చెప్పారు. తన మాటల్లో నిజం ఉంది.. గులాబీ జెండా భుజాన వేసుకుని కదలిరండి అని పిలుపునిచ్చారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారు.. మీ నుంచే వస్తారని అన్నారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నాతో ఉద్యమంలో పాల్గొన్నాడు. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాడు.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారని తెలిపారు.
మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. అవన్నీ పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఏమేం సాధ్యమయ్యాయో.. మహారాష్ట్రలో కూడా అవన్నీ అమలు కావాలని అన్నారు. తన మాటాల్లో నిజం ఉందని.. గులాబీ కండువా భుజాన వేసుకుని కదలిరావాలని పిలుపునిచ్చారు. దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ రాగానే దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. యుద్ధం చేయండి.. తల్వార్లు తిప్పండి అని చెప్పడం లేదని.. కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతుందని తెలిపారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రిజర్వాయర్ జింబాంబ్వేలో ఉందని కేసీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 వేల టీఎంసీల రిజర్వాయార్లు చాలా ఉన్నాయని కానీ మన దేశంలో అలాంటివి ఏవీ లేవన్నారు. భారత్లో రిజర్వాయార్లు పెరగలేదు కానీ.. ట్రైబ్యునల్స్, నదీ జలాల వివాదాలు పెరిగిపోయాయని అన్నారు. రిజర్వాయర్లకు అనుమతులు వచ్చే సరికి 30 ఏళ్ల సమయం పడుతోందన్నారు. కేంద్రం ట్రైబ్యునళ్ల పేరుతో చేతులు దులుపుకుంటోందని అన్నారు. రిజర్వాయర్లు కట్టాలంటే కేంద్రం అనుమతుల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణతో మహారాష్ట్రది రోటీ - భేటీ బంధమని అన్నారు. నిత్యం తెలంగాణకు వచ్చేవాళ్లంతా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికిందని అన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినప్పటికీ వారం రోజుల్లో రూ.5 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. ఎకరానికి ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం రైతు బంధు కింద అందజేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామని తెలిపారు. తెలంగాణలో సాధ్యమైన ఈ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు.. దేశంలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు.
బీడ్, లాథూర్, పర్బనీ వంటి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఇంతకంటే దారుణ పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ ఇప్పుడు తాగు, సాగు నీళ్లకు సమస్యలు లేవని.. ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ఒక్కొక్క రైతు 50 మోటర్లు పెట్టుకున్నా అడ్డు చెప్పడం లేదన్నారు. రైతు రాజ్యం వస్తేనే బీడ్, లాథూర్, పర్బనీ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
రైతు బీమా, రైతు బంధు ఇచ్చి తెలంగాణలో రైతులను ఆదుకుంటున్నామని, రైతు చనిపోయిన నాలుగు రోజుల్లో బీమా డబ్బులు ఇస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని.. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో కావాల్సినంత బొగ్గు ఉంది. కనీ కరెంట్ ఎందుకు రావడం లేదని అన్నారు. దీని వెనుకున్న కుట్రలేందని అన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద రిజర్వాయర్ చిన్నదేశమైన జింబాబ్వేలో ఉంది. రష్యా, అమెరికా, చైనా దేశాల్లోవేల టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత విశాల భారతదేశంలో ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా నోచుకోలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల పంచాయతీ వచ్చిందంటే చాటు ట్రైబ్యునళ్లు ఏర్పాటుచేస్తారని.. దశాబ్దాలైనా అవి నీటా వాటాలను తేల్చవని అసహనం వ్యక్తం చేశారు. నీళ్లు ఇస్తారని ఇప్పటి ప్రభుత్వాల మీద భరోసా ఉందా అని ప్రశ్నించారు. మన కిసాన్ సర్కార్ వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని స్పష్టంచేశారు. మన కిసాన్ సర్కార్ వస్తే ఇంటింటికీ శుద్ధమైన తాగు నీరు అందుతుందని చెప్పారు.
దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏటా లక్షాల 40వేల టీఎంసీల వర్షపాతం నమోదవుతుంటే.. 20వేల టీఎంసీల నీళ్లను మాత్రమే దేశం వాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే దేశ ప్రధానులు తమాషా చూశారని మండిపడ్డారు. అనేక జీవనదులు ఉన్న మహారాష్ట్రలో సాగునీటికి కరవెందుకు వచ్చిందని ప్రశ్నించారు. 54 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది.. 16 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉందని అన్నారు. 75 ఏళ్లలో రెండే రెండు పార్టీలు దేశాన్ని ఏలాయని.. కానీ ఏం ఒరిగిందని మండిపడ్డారు.
75 ఏళ్లు దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలించాయని, దేశంలో వెనకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం అని కేసీఆర్ అన్నారు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటున్నారని అన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిపోయిందన్నారు. మన్కీ బాత్ పేరుతో దేశాన్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఎందుకు అన్నారు. పతంగులకు కట్టే మాంజాల నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచే వస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలన్నారు. ఇది రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య అని అన్నారు.
భారతదేశం పేద దేశం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు. అమెరికా కంటే కూడా మన దేశం సంపదత్వం గల దేశమని ఆయన అన్నారు. దేశ సంపద మొత్తం కొంతమంది చేతుల్లోకే వెళ్తుందని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
మతాలు, జెండాలు, కులాల పేరుతో దేశంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం అని సీఎం కేసీఆర్ తెలిపారు. మన దేశంలో 16 కోట్ల మంది రైతులు ఉన్నారని.. దేశ జనాభాలో రైతులు, వ్యవసాయ కూలీలు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. భారతదేశం బుద్ధిజీవుల దేశం.. బద్దూగాళ్ల దేశం కాదని స్పష్టం చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిస్తే దేశమంతా కదిలివచ్చిందని గుర్తుచేశారు. రైతులు కేవలం నాగలి దున్నేవాళ్లే కాదు.. చట్టాలు చేసేవాళ్లుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. రైతుల్లో చైతన్యం వస్తే సర్కారు సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. నాయకులు కాదని.. ప్రజలు గెలవాలని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ఇందుకు కారణం ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకీ దుస్థితి అని ప్రశ్నించారు. దేశంలో 42 శాతం మంది రైతులే ఉన్నారని అన్నారు. కేంద్రంలో పార్టీలు మారాయి.. ప్రధానులు మారారని, అయినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. పంటను మీరే పండించాలి.. మీరే అమ్ముకోవాలి. అప్పుడే రైతు రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదని కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచించాలని సూచించారు. ఎన్నికష్టాలు.. ఎన్ని కన్నీళ్లు.. ఎంత ఆవేదన ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించండి. దేశానికి అన్నంపెట్టే రైతన్న ఉసురు తీసుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదించింన పార్టీ దేశంలో బీఆర్ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందన్నారు. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశంలో సాగు, తాగునీరు, కరెంట్ కోసం కష్టాలేనా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితమవుతున్నారని, దేశంలో నాయకత్వ మార్పు రావాలని పిలుపునిచ్చారు.
దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినట్టే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు, ప్రధానులు, నాయకులు మారిన దేశం తలరాత మారలేదని అన్నారు. ఇన్నేళ్లయినా తాగునీరు లేదు. సాగు నీరు లేదు.. కరెంట్ లేదు అని అన్నారు. వనరులు లేక కాదు.. చేతకాక ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీగా అవతరించాం. దేశ దుస్థితిని చూసిన తర్వాత ఈ పరిస్థితి మార్చాల్సి ఉందని భావించాం. మా సంకల్పానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుంది. నేను చెప్పే ఇషయాలకు ఇక్కడే మరిచిపోకుండా.. మీమీ గ్రామాల్లో చర్చించండి.
భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, యువకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ నాందేడ్ సభా వేదికపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరఠా యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్, మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు కేసీఆర్ నివాళులర్పించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభా వేదికపైకి రాగానే ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. ఈ సమయంలో జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినదించారు. బీఆర్ఎస్ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. సభ ముగిసిన అనంతరం స్థానిక సిటీ ప్రైడ్ హోటల్కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. 5 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.
నాందేడ్లోని చారిత్రక గురుద్వారాలో సీఎం కేసీఆర్ తమ ప్రార్థనలను ముగించారు. గురుద్వారా బయట.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిక్కు మత గురువులతో కలిసి ఫోటోలు దిగారు. కేసీఆర్తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
నాందేడ్ ఎయిర్పోర్టు నుంచి చారిత్రాక గురుద్వారాకు సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్లో వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ను చూసేందుకు నాందేడ్ వాసులు రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో నిల్చున్నారు. దీంతో కాన్వాయ్లో నుంచే కేసీఆర్.. నాందేడ్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ స్థానికులు నినదించి, కేసీఆర్కు మద్దతు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు సిక్కు మత గురువులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం కేసీఆర్ను సిక్కు మత గురువులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
నాందేడ్ బీఆర్ఎస్ సభలో ఓ యువతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరాఠీకి చెందిన గోదాతీర్ అనే పత్రికలో స్థానిక నాయకుడు ఇచ్చిన కేసీఆర్ యాడ్ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరమని ఆ యువతి పేర్కొంది. రైతుల, యువత పట్ల కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపింది. యూత్ మద్దతు కేసీఆర్కు తప్పక ఉంటుందని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు ఉన్నారు. మరికాసేపట్లో నాందేడ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
బీఆర్ఎస్ నాందేడ్ సభలో కేసీఆర్కు వృద్ధ మహిళలు జేజేలు పలికారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమ రాష్ట్రానికి అవసరం ఉందని వారు అంటున్నారు. మా ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్ను తప్పకుండా ఆశీర్వదిస్తామన్నారు. కేసీఆర్ను ప్రధానిగా చూడాలన్నదే తమ సంకల్పం అని వృద్ధ మహిళలు పేర్కొంటున్నారు. తెలంగాణలో వృద్ధులకు అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు.
గులాబీ దళపతి కేసీఆర్కు మరఠ్వాడాలో మంచి క్రేజ్ ఉంది. సభకు తరలివస్తున్న మహారాష్ట్ర వాసులు కేసీఆర్ ప్రధాని కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని సభా ప్రాంగణంలో కూడా మహారాష్ట్ర వాసులు నినదిస్తున్నారు. యూత్ కేసీఆర్కు మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నాందేడ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు వృద్ధులు, వికలాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వికలాంగుడు వీల్ చైర్లో కేసీఆర్ సభకు వచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తనను ఎంతో ఆకర్షించాయన్నారు. వికలాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షించాడు. కేసీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అని పేర్కొన్నాడు. దేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ పథకాలను అమలు చేయాలని ఆ వికలాంగుడు అన్నాడు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై మరఠ్వాడా మహిళలు ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. మహారాష్ట్రలోని నలుదిక్కుల నుంచి మహిళా లోకం నాందేడ్ వైపు కదం తొక్కింది. సభకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ రాష్ట్రంలో కూడా వితంతువులకు, వృద్ధులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు.
నాందేడ్ బీఆర్ఎస్ సభలో రైతులు ప్రదర్శించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల నినాదాలను వారు ప్రదర్శించారు. అందులో కొన్ని.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. దేశంలో రాబోయేది కిసాన్ సర్కారే. ఈ దేశానికి ప్రధాని ఎంతో.. కేసీఆర్ కూడా అంతే.., ఈ దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
బీఆర్ఎస్ నినాదాలతో గురుద్వార్ మైదానం మార్మోగుతోంది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదాలతో సభ హోరెత్తుతుంది. సభా ప్రాంగాణానికి మహారాష్ట్ర వాసులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం వేయి కళ్లతో వారు ఎదురుచూస్తున్నారు.
నాందేడ్లో సీఎం కేసీఆర్ హోర్డింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాందేడ్ ఎయిర్పోర్టు నుంచి బీఆర్ఎస్ సభాస్థలి వరకు కేసీఆర్ ఆహ్వానిస్తూ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. గులాబీ తోరణాలను ఏర్పాటు చేశారు. ఉద్యమకాలం నుంచి గులాబీ దళపతికి మహారాష్ట్రలో ఫాలోయింగ్ ఉంది.
బీఆర్ఎస్ నాందేడ్ సభకు మహారాష్ట్ర వాసులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక స్థానిక పత్రికల్లో కేసీఆర్ కథనాలను ప్రచురించారు. వాటిని స్థానికులు ఆసక్తిగా చదువుతున్నారు. గోదాతీర్ అనే పత్రికలో స్థానిక నాయకుడు ఒకరు బీఆర్ఎస్ యాడ్ ఇచ్చి ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం తెలంగాణ వెలుపల తొలిసారిగా నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
ఎవరూ ఊహించని రీతిలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలుంటాయి. ఇప్పటికే సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు సర్పంచ్లు చేరిపోయారు. నేటి సభలో పదుల సంఖ్యలో సర్పంచ్లు, నాందేడ్ జిల్లాకు చెందిన బీజేపీ, శివసేన, కాంగ్రెస్కు చెందిన కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు చేరనున్నారు. ఇక సరిహద్దు గ్రామాల ప్రజలైతే తెలంగాణ తరహా పాలన కావాలంటూ, బీఆర్ఎస్ వెంట నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2003, మార్చి 27 సువర్ణాక్షరంతో లిఖించబడింది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఆనాడు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కారు ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీ హైదరాబాద్ నుంచి 100 కార్లతోనే మొదలవ్వగా దారి పొడవునా ప్రజలంతా తమ సొంత వాహనాలతో కేసీఆర్కు జేజేలు పలుకుతూ కదం తొక్కారు. అలా ఢిల్లీ బాటలో భారీ వాహన శ్రేణితో కేసీఆర్ ప్రత్యేకంగా వైర్లెస్ సెట్లో అందరినీ సమన్వయం చేసుకొంటూ ముందు కు సాగారు. ఈ అపురూప ఘట్టంలో మొదటి రోజు పెన్గంగ నదీ తీరంలో కేసీఆర్ బస చేశారు. మరునాడు మహారాష్ట్రలోని విదర్భ నుంచి బయల్దేరగా నాగ్పుర్లో వేల మంది కేసీఆర్కు జిందాబాద్ కొడుతూ స్వాగతం పలికారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత అదే మరాఠా గడ్డపై కేసీఆర్ సమావేశం ద్వారా ప్రజల్లోకి వస్తుండటం విశేషం. ఉద్యమ సమయంలో నాగ్పూర్ ప్రజల ఆశీర్వాదం ఫలించగా, ఇప్పుడు దేశం కోసం సీఎం కేసీఆర్ తమ గడ్డపై తలపెట్టిన మహత్కార్యం సిద్ధిస్తుందని నాందేడ్ ప్రజలు అంటున్నారు.