హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 12న పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వివరాలు వెల్లడించాయి. ఇటీవల హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి ప్రతిపక్ష నేతతో పాటు మండలి, శాసనసభాపక్షాల డిప్యూటీ లీడర్లు హాజరుకానున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జుల నియామకం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేసి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్లో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. అదేవిధంగా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.