హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని, కేంద్ర పన్నుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నిధులను విడుదల చేయకుండా నరేంద్రమోదీ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని సోమవారం లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా కేంద్రానికి వివిధ రాష్ర్టాల నుంచి రూ.30,48,044 కోట్ల ఆదాయం లభిస్తున్నదని, అందులో రాష్ట్రాలకు తిరిగి ఇచ్చింది రూ.8,82,903.79 కోట్లేనని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు.
మొత్తం రాబడిలో దాదాపు రూ.22 లక్షల కోట్లను కేంద్రం తన వద్దే ఉంచుకొని రాష్ర్టాలకు భిక్షం వేస్తున్నదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలవారీగా వసూలైన ఆదాయం ఎంతో వెల్లడించాలని కోరితే ఆ వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.18,720.54 కోట్లు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి చెప్పారని, కానీ రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేసిందీ చెప్పకపోవడం సమంజసంగా లేదని పేరొన్నారు. రాష్ర్టాల నుంచి కేంద్రం వసూలు చేస్తున్న సొమ్ముకు, తిరిగి రాష్ర్టాలకు ఇస్తున్న సొమ్ముకు పొంతనే లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం వివక్షను వీడి తెలంగాణకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని నామా డిమాండ్ చేశారు.