నర్సాపూర్, జనవరి 29: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. గతంలో బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా ఎన్నికైన మురళీయాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకుని పదవికి రాజీనామా చేయకుండా.. చైర్మన్గా చెలామణి అయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాసం పెట్టాలని అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
అవిశ్వాసానికి ముందస్తుగానే మురళీయాదవ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమయింది. సోమవారం తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా.. మొత్తం 15 మంది కౌన్సిలర్లలో 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామ్రెడ్డి, యాదవరెడ్డి హాజరయ్యారు. ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
మున్సిపల్ చైర్మన్గా దుర్గప్పగారి అశోక్గౌడ్ను కౌన్సిలర్ రాంచందర్ ప్రతిపాదించగా మరో కౌన్సిలర్ తంగెడుపల్లి సరితా ఆమోదించారు. దీంతో మిగతా కౌన్సిలర్లు మద్దతు ప్రకటించగా దుర్గప్పగారి అశోక్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అశోక్గౌడ్కు మున్సిపల్ చైర్మన్గా నియామకపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు అశోక్గౌడ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటగోపాల్, పట్టణ ప్రణాళిక అధికారి భూపతి, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణయ్య, మేనేజర్ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.