BC Reservations | హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. అందుబాటులో ఉన్న బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమై బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంపై చర్చించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరినే అనుసరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కులగణన నుండి ప్రారంభించి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యంగా ఉందని విమర్శించింది.
బోనాల పండుగ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో అందుబాటులో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహ పూరిత కార్యక్రమాలపైన కేటీఆర్ విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశంలో, ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని బీసీ నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.
తాము తీసుకువచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా, మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని వారు పేర్కొన్నారు. కులగణన జీవో నుండి గణన ప్రక్రియ వరకు బీసీల సంఖ్యను తగ్గించి చూపడంలో కాంగ్రెస్ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందన్నారు. తాము చేపట్టిన ప్రతీ ప్రక్రియలో ఉన్న లోపాలు, లొసుగులు ముందే తెలిసినా, బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో, చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కులగణన మరింత శాస్త్రీయంగా జరగాలని చెప్పే కాంగ్రెస్ పార్టీ.. అత్యంత లోపభూయిష్టంగా దురుద్దేశపూర్వకంగా నిర్వహించిన కులగణన సర్వేను జాతీయ రోల్ మోడల్గా చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా, జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతున్నదని నేతలు మండిపడ్డారు. ఒకవైపు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో బీసీలను మోసం చేస్తూనే.. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కారు అమలు చేయకుండా బీసీలను మభ్యపెడుతుందని బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేసి కొత్త పథకాలు ప్రారంభించకపోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ వారికి చేస్తున్న ద్రోహమే అన్నారు.