KCR | ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అనేకమైన అడ్డగోలు అహామీలు ఇచ్చి టెంప్ట్ చేసింది. మంచిగున్నవాళ్ల నోట్లో మట్టికొట్టింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మళ్లీ సిగ్గులేకుండా మళ్లీ ఇవాళ నాలుగైదు హామీలు ఇచ్చారట. ఇది ఎవరిని ఉద్దరించడానికో అర్థం కావడం లేదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు. కరెంటు మోటర్లు కాలని జిల్లా లేదు యావత్ తెలంగాణలో. పాత తెలంగాణ మళ్లీ పునరావృతమైంది. ఇందిరమ్మ పాలనలో ఇగిలిచ్చిన పరిస్థితైంది ప్రజలదని మనవి చేస్తున్నా’నన్నారు.
‘ఇక్కడ బాధాకరం ఏంటంటే.. నీటి నిర్వహణ సామర్థ్యం తెలువనటువంటి లత్కోర్లు రాజ్యమేలుతున్నరు. అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నరు కాబట్టి ఈ పరిస్థితి సంభవించింది. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. కరీంనగర్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. కరీంనగర్, మెదక్ జిల్లాలతోపాటు గోదావరి బేసిన్లోని జిల్లాలకు ఎందుకు ఈ పరిస్థితి కాలేదు. ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత.. తెలివితక్కువ తనం ? ఇవాళ ఇట్లే కిరికిమాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలతో ఇతరులపై ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలనుకుంటున్నరు కానీ.. తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ల వాన అనుకుంటున్నరు కాదు.. దాని ద్వారా 1.50లక్షల ఎకరాలు పోయింది. 15లక్షల నుంచి 20లక్షల మధ్య ఇవాళ పంటలు ఎండిపోయినయ్. నేను పర్యటించిన నాలుగైదు గ్రామాల్లో.. పర్యటన లేని గ్రామాల్లో రైతులు అడ్డం వచ్చారు. వెధిర, గంగాధర పలుచోట్ల అడ్డం తిరిగి బస్సు ఆపి పంటను చేతికి ఇచ్చి పంట జరిగిందని చెబుతున్నరు. పైకి పచ్చగా కనిపించినా.. కింద నెర్రలుబారిందని చూడుమని పొలంలోపలికి తీసుకెళ్లి చూపించారు. ప్రతి దగ్గర ఇదే పరిస్థితి’ ఉందని తెలిపారు.
‘నీటి నిర్వహణ సామర్థ్యం లేక.. ఎట్ల వాడాలో తెలియక. ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. పాతబోర్లున్నయని కరెంటుతో పారిద్దామంటే కరెంటు నాణ్యతగా సరఫరా కాకపోవడం, మోటర్లు కాలిపోవడం రెండో కారణం. వెరసి ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండినయ్. కొంత మంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షాపాతం తక్కువ ఉంటే మా మీద బదనాం పెడుతున్నరని మాట్లాడుతున్నరు. కొన్ని జిల్లాలో ఏడుశాతం, కొన్ని జిల్లాల్లో 20శాతం, దాదాపు 20-25 జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాపాతం కురిసింది. అధిక వర్షాపాతం ఉండగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ? పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్పా దీనికి మరే కారణం లేదు.
నేనుకూడా దుఃఖంతో చెబుతున్న మాట ఏందంటే.. కాలం కాకపోతే రైతు ఇంత నష్టపోడు. కాలం కాకపోతే దేవుడినో.. ధర్మాన్నో తిట్టుకుంటడు. పంట వేయడు. కానీ పంట వేసి.. పెట్టుబడి పెట్టి.. ప్రతి ఊరిలో రోధిస్తున్నది.. ప్రతి చోట చెబుతున్నది ఏంటంటే.. రూ.22వేలు పెట్టామని కొందరు.. రూ.28వేలు పెట్టామని కొందరు.. పెట్టుబడి పెట్టి గంగపాలైనమ్ సర్ అని బాధపడుతున్నరు. కారణం ఏదీ ? రైతుబంధు మీద ఓ అరాకిరి. ఇప్పుడు వస్తరో..? ఎప్పుడు వేయరో.. చెప్పకపోవడం.. ఏడెకరాలు, మూడెకరాలని.. నాలుగెకరాలని తొండిపెట్టి రైతులను కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పటి వరకు రైతులకు వందశాతం రైతుబంధు వేయలేదు. దానిపై ఓ పాలసీ లేదు. చెప్పే ధైర్యం, తెలివితేటలు లేవు’ అంటూ గులాబీ దళపతి మండిపడ్డారు.