హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రెండోరోజైన గురువారం కూడా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, దేశం నలుమూలల నుంచీ అభిమానులు పోటెత్తారు. తన వద్దకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రంగాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కార్యకర్తను పేరుపేరునా పలకరించి, వారితో కేసీఆర్ ఫొటోలు దిగారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ సీఎం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రాజకీయాలు, పాలనలో గుణాత్మక ప్రత్యామ్నాయం కోసం సీఎం కేసీఆర్ కృషికి జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని అల్లం పేర్కొన్నారు. అలాగే కరెన్సీపై అంబేదర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ కేసీఆర్కు వినపతిపత్రం అందజేశారు. కేసీఆర్ను కలిసివారిలో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు మార్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రెడ్డి, జోగు రామన్న, కాంత్రికిరణ్, మాజీ ఎంపీ నగేశ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, నేత రావుల వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా తన కూతురు వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు.. కేసీఆర్ను కలిసి తాము బీఆర్ఎస్తో కలిసి పనిచేయటా నికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీ విశాఖపట్నంకు చెందిన లాడుగు గోవింద రావు బృందం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తాము బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని సీఎం కేసీఆర్కు చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశంలో గుణాత్మక మార్పులు తీస్తుందనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉన్నదని తెలంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం తెలిపారు.