హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకే ఎక్కువ నిధులు ఇచ్చారని, తెలంగాణ పథకాలను కాపీ కొట్టి తెలంగాణకే నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర గిరిజన వర్సిటీ ఏర్పాటుకు స్పష్టంగా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ర్టాలకు కొత్తగా రూ.50 వేల కోట్ల రుణాలిస్తామని బడ్జెట్లో పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదని, ఇది కొత్త పథకం కాదని పేర్కొన్నారు. కర్ణాటక అప్పర్ భద్రాకు రూ.5,300 కోట్లు కేటాయించి, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు నిధులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
విభజన హామీల్లోనూ తీవ్ర వివక్ష: నామా
రైతు వ్యతిరేక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. కర్ణాటకలో కరువు ఉన్నదని రూ. 5,300 కోట్లు కేటాయించారని, కర్ణాటక తప్ప మరెక్కడా కరువు లేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు నిధుల కేటాయింపు, విభజన హామీల్లోనూ తీవ్ర వివక్షత చూపించారని విమర్శించారు. రైల్వే ప్రాజెక్టుల్లోనూ అన్యాయం చేశారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదని, నిధుల కేటాయింపులో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము కోరిన ఏ ఒక్క దాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒకటీ ఇవ్వలేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణపై సవతితల్లి ప్రేమ: రంజిత్రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశకు నిధుల కేటాయించలేదని, ఫార్మారంగానికి కేరాఫ్గా ఉన్న హైదరాబాద్ను విస్మరించారని ఎంపీ రంజిత్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని ప్రశంసిస్తూనే నగరాభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మొదటి నుంచి తెలంగాణపై సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు.
ఏ అంశాన్నీ పరిగణించలే:రవిచంద్ర
ఈ బడ్జెట్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, ఏ రంగానికీ ఉపయోగపడేలా లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే, ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని,ఐఐఎం మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీకి ఆశించిన రీతిలో నిధులివ్వకపోవడం దారుణమని, జిల్లాకో నవోదయ పాఠశాల, బయ్యారం స్టీల్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు వంటి ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.