పాలకుర్తి రూరల్, నవంబర్ 26: రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిచెందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని కోతులాబాద్, అయ్యంగారిపల్లి, తిరుమలగిరి, ముత్తారం, తొర్రూరు జే, రాఘవపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మోసాల కాంగ్రెస్ను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం లోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు నడుస్తుంటే.. టీ పీసీసీ అధ్యక్షుడు రైతాంగానికి మూడు గంటల కరెంట్ ఇస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలిచ్చే బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. కొందరు కాంగ్రెస్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయ బ్రోకర్లుగా మారారని మండిపడ్డారు. అలాంటి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 40 ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. కొత్తగా అమెరికా నుంచి వచ్చిన వారికి ప్రజల కష్టసుఖాలు ఏం తెలుసని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్రావు, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.