హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం తెలిపారు. వివిధ దేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించాలని బీఎర్ఎస్ ప్రతినిధులను ఆయన కోరారు. సీఎం బర్త్డేను పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం చేయటం వంటి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని 17న హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ దవాఖాన పక్కన ఉన్న పురాతన రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్టు సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కల్యాణోత్సవంలో సీఎం కుటుంబసభ్యులతోపాటు 11 జంటలు పాల్గొంటాయని పేర్కొన్నారు.