BRS Party | హైదరాబాద్ : ఐదు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కేసీఆర్ వెంట నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కొందరు పనికట్టుకుని విష ప్రచారం మొదలు పెట్టారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల్లో భయం మొదలైందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా వచ్చి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అని మహేశ్ బిగాల ధ్వజమెత్తారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి 8 నుండి 12 పార్లమెంట్ స్థానాలు వస్తాయి. కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారు అని మహేశ్ బిగాల స్పష్టం చేశారు.