ఖమ్మం, ఏప్రిల్ 16: కాంగ్రెస్ చెప్పిన మాయమాటలను, ఆ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. అందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్న కసితో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం.. ఆ తరువాత వాటికి తిలోదకాలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
ఖమ్మంలోని మమత దవాఖాన ప్రాంగణంలో మంగళవారం జరిగిన పార్టీ ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సమరోత్సాహంతో పని చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ను దూరం చేసుకున్నందుకు ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారని తెలిపారు.