న్యూఢిల్లీ, జూలై 20 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో జరుగుతున్న దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ ఉభయసభల్లో బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే లోకసభలో నామా ఆధ్వర్యంలో ఎంపీలు వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పీ రాములు ఆందోళనకు దిగారు.
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ఇదే అంశంపై రాజ్యసభలో బీఎఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే కేశరావు, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర చర్చకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. మణిపూర్లో ఇద్ద రు మహిళలను వివస్త్రలుగా ఊరేగించి, లైంగికదాడికి పాల్పడటం అవమానవీయ ఘటన అని ఆగ్రహం వ్యక్తంచేశారు.