MP Maloth Kavitha | మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా కొట్లాడిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై రాజకీయ విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎంపీ మాలోత్ కవిత మండి పడ్డారు. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని స్పష్టం చేశారు. 60 ఏండ్లు దేశాన్ని పరిపాలించిన బీజేపీ, కాంగ్రెస్ లకు గిరిజనులు, మహిళలకు ప్రయోజనం కలిగించే చట్టాలు చేయడం చేత కాలేదని ధ్వజమెత్తారు. గిరిజనుల జనాభా ప్రకారం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. 3146 గిరిజన తండాలు, గోండు గూడేలు, చెంచు పెంటలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వం, గిరిజనుల ‘మా తండాలో మా రాజ్యం’ అనే దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చారని వెల్లడించారు.
రాష్ట్రంలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏనాడూ పార్లమెంటులో గిరిజనులు, మహిళల హక్కులు, అభివృద్ధి కోసం కొట్లాడిన పాపాన పోలేదని మాలోత్ కవిత అన్నారు. కేంద్ర మంత్రి కేంద్ర ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, మణిపూర్ అల్లర్లలో గిరిజన ప్రజలు అగ్నికి ఆహుతవుతుంటే నిస్సిగ్గుగా తెలంగాణలో నీచ రాజకీయాలు చేశారు తప్ప, మణిపూర్ వెళ్లి బాధితులు ధైర్యం చెప్పలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఏర్పడి పదేండ్లు అయినా రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయని బీజేపీకి, గిరిజనుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాలోత్ కవిత తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా సాధికారతకు పెద్దపేట వేసిస బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు పూర్తిగా అర్థం లేనివని వ్యాఖ్యానించారు. 50 ఏండ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం ఎందుకు చేయలేకపోయిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ది చెప్పడం ఖాయం అని స్పష్టం చేశారు.