K Keshava Rao | అయోధ్య రామమందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ సర్కారు ప్రజా సమస్యలను పక్కనపెట్టి అయోధ్య రామమందిరంపై పార్లమెంట్లో చర్చపెట్టి తీర్మానం చేసిందని విమర్శించారు. రామాలయంపై పార్లమెంట్లో తీర్మానం చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు.
అయితే, సభాపతి అధికారాన్ని తప్పుబట్టడం లేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రామాలయం, రాముడిని రాజకీయం చేస్తుందన్నారు. అయోధ్య గుడికి వెళ్లనివారు దేశ వ్యతిరేకులు కాదన్నారు. అయోధ్య గురించి మాట్లాడుతున్న మోదీ తెలంగాణలోని అతిపెద్ద దేవాలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్లో చేరడంపై కేకే స్పందిస్తూ.. అవసరాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నేతలు పార్టీ మారుతుంటారని విమర్శించారు.
కాంగ్రెస్లో చేరిన తర్వాత బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని.. అన్నింటికన్నా ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనడం బాధించిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాతీర్పునుల బట్టి మారుతూ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, మిగతా చోట్ల గట్టి పోటీ ఇస్తుందని స్పష్టం చేశారు.