జగిత్యాల, మార్చి 10 (నమస్తే తెలంగాణ)/ధర్మారం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీటిని అందించాలని, లేదంటే పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతు ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు.
జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం మారేడుపల్లి,ముంజంపల్లి, ఉండెడ గ్రామాల్లో 1,800 ఎకరాల్లో దెబ్బతిన్న వరిపొలాలను జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలోని మహేశ్వర ఫంక్షన్ హాలు లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఎస్సారెస్పీ పంప్హౌస్ ద్వారా నీళ్లు వస్తాయని గంపెడాశతో దాదాపు 820 మంది రైతులు వరి సాగు చేశారని పేర్కొన్నారు. పొట్ట దశలో సాగు నీరందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.కాలువ ద్వారా నీళ్లు ఇవ్వని పరిస్థితుల్లో మారేడుపల్లి పకనే ఉన్న వేంనూర్ పంప్హౌస్ నుంచి నంది రిజర్వాయర్కు నీటిని తరలించే పైప్లైన్ వాల్వ్ను విప్పి ఎస్సారెస్పీ 11-ఎల్ కాలువలోకి నీటిని మళ్లించి, వాటి ద్వారా పంటలు కాపాడవచ్చని సూచించారు.
మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించి ప్రాజెక్టును వినియోగించవచ్చని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదని చెప్పడానికే కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.