హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించాల్సిన పవిత్రమైన చట్టసభలలో ప్రభుత్వం కావాలనే భయానక, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవడానికి ఏకంగా నక్సలైట్ల ఏరివేత విభాగమైన గ్రేహౌండ్స్ పోలీసులను మోహరించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక ప్రజా సమస్యలపై కూలంకషంగా మాట్లాడేందుకు కనీసం నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము పట్టుబట్టామని గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభా పక్ష (బీఆర్ఎస్ఎల్పీ) అంతర్గత సమావేశాన్ని కుట్రగా సీఎం చిత్రీకరించడం, దానిపై సిట్ విచారణకు ఆదేశించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీని పవిత్ర ప్రజాస్వామ్య వేదికగా కాకుండా రేవంత్రెడ్డి ‘కౌరవసభ‘గా మార్చివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ప్రజలు అల్లాడుతుంటే, వాటిపై చర్చించకుండా మూడు రోజులపాటు రేవంత్రెడ్డి సొల్లు పురాణంతో సభా సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ఆడుతున్న క్షుద్ర రాజకీయాలకు అసెంబ్లీని బలిపీఠం చేశారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని, ఆయనపై సభా హకుల ఉల్లంఘన కింద అనర్హత వేటు వేసి అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల వాదన వినకుండానే ఏకపక్షంగా వారిని సస్పెండ్ చేసి, ఆ తర్వాత ఎథిక్స్ కమిటీకి పంపడం తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని దుయ్యబట్టారు.