హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మహిళా బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు, మేధావులకు పోస్ట్కార్డులు రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ను విడుదల చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్య అంశం కాకూడదు?’ అని పోస్ట్కార్డు ఉద్యమం ద్వారా ఆలోచింపజేస్తున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద దీక్షతోపాటు దాదాపు 18 పార్టీలు, మహిళా సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఆందోళనను మరింత తీవ్రతీరం చేయాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్కాల్ కార్యక్రమంతోపాటు దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు.