MLC Kavitha | న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. మళ్లీ రెండు వారాల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడేందుకు జడ్జి అనుమతించలేదు.
కోర్టులో మాట్లాడేందుకు జడ్జి అనుమతించకపోవడంతో ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. లిక్కర్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తప్పు చేశాననడానికి ఆధారాల్లేవు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అరెస్టు చేశారు. నేను ఎలాంటి ఆర్థిక లబ్ది పొందలేదు. ఈ వ్యవహారంలో నేను బాధితురాలిని. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదు. సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా నా ప్రతిష్టను దిగజార్చారు. నా మొబైల్ నంబర్ను అన్ని ఛానల్స్లో వేసి, నా ప్రైవసీకి భంగం కలిగించారు అని కవిత పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలతో పాటు ఇతర బిజినెస్ వివరాలను కూడా ఇచ్చాను. గత రెండున్నరేండ్ల నుంచి విచారణ పేరుతో మాససికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవాళ ఈడీ, సీబీఐ కేసులను పరిశీలిస్తే.. ఒక 95 శాతం కేసులు ప్రతిపక్ష పార్టీలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుంది. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలన్నారు. ఇలా బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని మళ్లీ కోరుతున్నాను. ఎందుకంటే నా కుమారుడి బోర్డు ఎగ్జామ్స్పై ప్రతికూల ప్రభావం పడొద్దనే ఉద్దేశంతో, ఈ సమయంలో తనతో నేను ఉండాలి. కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నానని కవిత లేఖలో పేర్కొన్నారు.