హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కవితకు న్యాయస్థానం వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఆమెను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టంచేసింది. కుటుంబ సభ్యులు, న్యాయవాదులను రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలుసుకోవచ్చని, భోజనం ఇంటి నుంచి తెప్పించుకోవచ్చని చెప్పింది. వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులను తెప్పించుకోవచ్చని చెప్పారు. వైద్యులు పరీక్షించినపుడు కవిత హైబీపీతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆదివారం కోర్టు నిర్దేశించిన సమయంలో కవిత భర్త అనిల్, కేటీఆర్, హరీశ్రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశం ఉన్నది.
ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం
ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత ప్రమేయం ఉన్నదని నిర్ధారించేందుకు తమ వద్ద సంపూర్ణ ఆధారాలు ఉన్నాయని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. ఈ కేసులోని ప్రధాన సూత్రధారులు, లబ్ధిదారుల్లో ఆమె ఒకరని తెలిపింది. అనుకూలమైన మద్యం విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు శరత్రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు ఆమ్ఆద్మీ పార్టీలోని ప్రధాన నేతలతో రూ.100 కోట్ల మేర ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. కవిత నేరుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. ఆమెతోపాటు మరికొందరు సౌత్ గ్రూప్ సభ్యులు కలిసి మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు చేశారని వెల్లడించింది. ఇండో స్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిైళ్లె చెప్పిన అనేక విషయాలు ఈ కేసులో కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయని తెలిపింది.
33 శాతం లాభాలు మేడమ్కు వెళ్తాయి అని బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, రాఘవ మాగుంట సహా నిందితులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు పేర్కొన్నది. నిరుడు మార్చి 11న ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. నిరుడు మార్చి 21న కవిత తన స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా 9 ఫోన్లను సమర్పించారని తెలిపింది. ఇవన్నీ ఫార్మాట్ చేసి ఇచ్చినవేనని పేర్కొంది. డాటా రికవరీ కోసం ఎన్ఎఫ్ఎస్యూకు పంపామని, ఆ నివేదిక ప్రకారం.. కవితకు నోటీసులు ఇచ్చాకే ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు తేలిందని తెలిపింది. కవిత ఫేస్టైమ్ని వాడుతున్నట్టు ఒప్పుకున్నారని, కానీ ఈడీకి ఇచ్చిన ఫోన్లలో వాట్సాప్, ఫేస్టైం డాటా లేదని పేర్కొంది. ఈ కేసులో తన ప్రమేయం బయటపడొద్దనే ఉద్దేశంతోనే డాటాను డిలీట్ చేసినట్టు ఆరోపించింది.