BRS MLC Kalwakuntla Kavitha | తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ఏఎన్ఐ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ.. `ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరశాలలో ఏర్పాటు చేస్తున్నారు` అని వ్యాఖ్యానించారు.
`కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం. కోట్ల మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు.
బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరం` అని కవిత తెలిపారు.
`బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలి. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలి` అని కవిత డిమాండ్ చేశారు.