MLC Kavitha | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అని వ్యంగ్యంగా అన్నారు. మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతం అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు.
16 నెలల పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రాచిరంపాన పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని.. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని.. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు.. అక్రమ కేసులు.. అరెస్టులతో వేధించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ హైదరాబాద్ పర్యటనలో హెచ్సీయూను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించాలని రాహుల్గాంధీకి సూచించారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, మీ సోదరి ప్రియాంకా గాంధీని.. మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. బిహార్ లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మీరు, సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. డిసెంబర్ 9 , 2023 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారని.. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని.. అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకు అని అడిగారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. మీ మౌనం దేనికి సంకేతమని నిలదీశారు.