వరంగల్ : తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయం చేయడం వృథా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. షర్మిల తన రాజకీయాన్ని ఆంధ్రాకు మార్చుకోవాలి అని సూచించారు. తెలంగాణ బడ్జెట్పై షర్మిల మాట్లాడటం బాధాకరం. వైఎస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే. సమైక్యాంధ్ర నినాదంతో ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని కడియం తెలిపారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. షర్మిల.. ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు. రేపో మాపో జగన్ జైలుకు పోతే నీకు అవకాశం వస్తుందన్నారు. ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృథా చేసుకోకు అని కడియం శ్రీహరి సూచించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు అని కడియం ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని స్పష్టం చేశారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణది మొదటిస్థానం అని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. పేదలను దోచి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడమే గుజరాత్ మోడల్ అని ధ్వజమెత్తారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే తెలంగాణ మోడల్ అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.