హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ నిరాహార దీక్షకు అన్ని రాష్ర్టాల్లోని మహిళా సంఘాల ప్రతినిధులను, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళలు రాజకీయ రంగంలో ముందుండాలంటే రిజర్వేషన్తోనే సాధ్యమని తెలిపారు. మార్చి 8న హోలీ పండుగ ఉన్నందున మార్చి 10న ఢిల్లీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేస్తామని వివరించారు. మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సగం మంది ఇంట్లోనే ఉంటే విశ్వగురు ఎలా?
2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు ఉప కోటా ఉండాలని డిమాండ్ చేశాయని, ప్రతి ఒకరికీ వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉప కోటా ఉండాలన్నది తమ కోరిక అని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సందర్భం వచ్చినప్పుడల్లా తాను మాట్లాడానని గుర్తుచేశారు. 20 ఏండ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని పేర్కొన్నారు. కానీ, భారత్ ఆ లక్ష్యాన్ని చేసుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువుగా చేయలేరని విమర్శించారు. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. జనగణనతో పాటు ఓబీసీ జనగణన సైతం చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
1992లో 72వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారని, 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ప్రస్తుతం 21 రాష్ర్టాలు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాయని, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారని వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసేందుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇవ్వడంతోపాటు మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు కూడా సూచించారని గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుల సంఖ్యను 33% పెంచి మహిళలకు కేటాయించాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. 1952లో మొదటి లోక్సభలో మహిళా ఎంపీలు 24 మంది ఉండగా, ప్రస్తుతం 78 మంది ఉన్నారని, వారి ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో పెరగలేదని చెప్పారు.
అదానీ కుంభకోణంపై విచారణ ఏదీ?
ఆదానీ అంశాన్ని పకదారి పట్టించేందుకు గ్యాస్ ధర రూ.50 పెంచారని, ఢిల్లీలో అరెస్టులు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేంద్ర విచారణ సంస్థలతో విచారణ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందని తెలిపారు. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల సంఘం బీజేపీ, మోదీ కబంధ హస్తాల నుంచి బయటపడిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు చూస్తే.. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.
మహిళలకు రక్షణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడదని నిందితులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అరెస్టు చేస్తారని చెప్పడానికి బీజేపీవాళ్లు ఎవరు? అది ఏజెన్సీల పని కదా.. అలా చెప్తున్నారంటే వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్టే కదా? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగి అన్ని పార్టీలతో చర్చలు జరిపితే.. బీఆర్ఎస్గా తాము ఏమి చేయాలో చెప్తామని పేర్కొన్నారు. బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.