హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12వ రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం తీర్మానం చేసిన పదేండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. మరింత కాలయాపన చేయకుండా తక్షణమే రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో పలువురు మహిళా నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం కూడా ఉండాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రతిపాదన తరహాలో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. దీనితో అన్ని వర్గాల మహిళలకు రిజర్వేషన్ల ఫలాలు అందుతాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రి సత్యవతి రాథోడ్తోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. కాలేజీ విద్యార్థినులు పెద్దఎత్తున తరలి వచ్చి కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పోరాటం కొనసాగిస్తాం..
మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఐదేం డ్లు వేచి చూడాల్సి రావడం బాధాకరమని తెలిపారు. బిల్లుకు లోక్సభ ఆమోదంతో దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ పోరాట ఫలితమే: సత్యవతి
బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి సత్యవతి తెలిపారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కవిత చొరవతోనే మహిళా బిల్లుకు మోక్షం కలిగిందని అన్నారు. బీఆర్ఎస్ కోరుకున్నట్టు ‘ఆకాశంలో సగం, భూమి లో సగం, అధికారంలో సగం’ అనే నినాదం నెరవేరడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్కు, సహకరించిన కవితకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలిపారు. కవితను కలిసిన వారిలో ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్, బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు నల్ల భారతి, ఆశ వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు సంతో ష తదితరులు ఉన్నారు.