హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీసీలపై ప్రేమ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. ఈటలకు బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే కులగణన చేయాలని, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. గురువారం ఆయన బీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో ఈటలను నిరాశ, నిసృ్పహ, అసూయ, అసహనం ఆవరించాయని ఎద్దేవా చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తానే అన్న విషయాన్ని మరిచిపోయి సీఎం కేసీఆర్ను అడ్డగోలుగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మొండిచేయి చూపిన కేంద్ర బడ్జెట్ను ఈటల ఏ ముఖం పెట్టుకొని సమర్థిస్తారని నిలదీశారు. ‘ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నందుకా? పీఎం కిసాన్ యోజన నిధులు తగ్గించినందుకా? విభజన హామీలను నెరవేర్చనందుకా? రాష్ర్టానికి ఒక నర్సింగ్ కాలేజీ కూడా ఇవ్వనందుకా? సంక్షేమ రంగానికి నిధులు తగ్గిస్తున్నందుకా? బడ్జెట్ ఎందుకు నచ్చిందో చెప్పాలి’ అని నిలదీశారు.
ఈటల రాజేందర్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? అని భానుప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను మూలధన వ్యయంగా ఖర్చుచేసిందని, దేశంలోనే క్యాపిటల్ వ్యయం అత్యధికంగా ఉన్నది తెలంగాణలోనేనని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాను తెచ్చిన అప్పులను ఉత్పాదక రంగాల మీద ఖర్చు పెడితే.. కేంద్రం తాను తెచ్చిన అప్పులను బీజేపీ కార్పొరేట్ మిత్రులకు దోచి పెడుతున్నదని ధ్వజమెత్తారు. ఈటల హయాంలో హుజురాబాద్లో నిర్మాణం పూర్తయిన భవనాలను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టించిందని గుర్తు చేశారు. దళితుల అసైన్డ్ భూములను గుంజుకున్న ఈటల నీతి వాక్యాలు చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడిగా విఫలమై, పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల ఈటల అసహనంతో
ఉన్నారని చెప్పారు.