హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆటోల్లో అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటికే అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకున్న ఎమ్మెల్యేలు.. ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులు పట్టుకొని ఆటోల్లో వచ్చారు. వారి ఆటోలను అసెంబ్లీ లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు దిగి నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు.