హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం బుధవారం హోరెత్తింది. సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని అడిగినా స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తున్న బీఆర్ఎస్ సభ్యులను వందలమంది మార్షల్స్, పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై సభా నాయకుడు అడ్డగోలుగా మాట్లాడటం ఏంటని, కనీస మర్యాద, సభ్యత లేకుండా అన్పార్లమెంటరీ పదాలను వాడారని, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ వైపు స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం తీరును ప్రజలకు వివరించడానికి అసెంబ్లీ మీడియా పాయింట్ వైపునకు వెళ్లడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ సమీపంలోనే పోలీసులు, అసెంబ్లీ మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులను అడ్డుకున్నారు.
మీడియా పాయింట్ వైపు వెళ్లడానికి వీల్లేదని స్పష్టంచేశారు. సభ జరిగేటప్పుడు మీడియాపాయింట్ వద్ద మాట్లాడవద్దనే నిబంధన ఉన్నదని చీఫ్ మార్షల్ చెప్పటంతో అందుకు సంబంధించిన ఆదేశాల కాపీని చూపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గతంలో సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ సభ్యులు అనేకమార్లు మాట్లాడారని గుర్తుచేశారు. కంచెలను తొలగించామని గొప్పగా చెప్తున్న ప్రభుత్వం, అసెంబ్లీ లోపలే కంచెలు వేసిందని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్రావు సహా ఇతర బీఆర్ఎస్ సభ్యులు అక్కడే కూర్చొని నిరసన తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి దిగజారి అభ్యంతరకర భాషలో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కేసీఆర్ పట్ల సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ పదాలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కోరుదామంటే స్పీకర్ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాము కూడా సీఎం భాషకు దీటుగా బదులివ్వగలమని, కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద గౌరవంతో ఓపిక పడుతున్నామని తెలిపారు.
తాను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశానని, అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొకుతున్నదని ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పినా అవకాశం ఇవ్వడంలేదు. అసెంబ్లీ ఆవరణలో సభ్యుల హకుపై నియంత్రణ ఎలా పెడతారు? ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా అధికార పక్షం వ్యవహరిస్తున్నది. ఇదంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నది’ అని ఆరోపించారు.
సీనియర్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి బడ్జెట్కు సంబంధం లేని విషయాలు ఎక్కడా మాట్లాడలేదని, సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భాషను సీఎం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో రెండు నెలల్లోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని, అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని, ప్రతిపక్ష నేతల గొంతు నొకుతున్నారని ధ్వజమెత్తారు. అమరవీరుల స్తూపానికి, సచివాలయానికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.