హైదరాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్కు(BC Corporation) నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆరోపించారు. గురువారం హరీశ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం దగ్గర నిరసన చేపట్టారు. అంతకుముందు గన్పార్క్ నుంచి అసెంబ్లీకి ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, కార్పొరేషన్లకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గొల్ల కుర్మలకు, మత్స్యకారులకు చేపపిల్లలను విడుదల చేయాలన్నారు. బీసీలను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ గద్దె దిగాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.