కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 27: ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నిండు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నరు. కేసీఆర్ సార్తో మాట్లాడు. వాళ్లను తీసుకొని వస్తానని నాతో చెప్పిండు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకటరెడ్డి ప్రజల్లో నమ్మకం కోల్పోయిన వ్యక్తి అని, ఆయన మాటలపై నమ్మకం లేకనే తాను ఈ విషయాన్ని ఇప్పటి వరకు కేసీఆర్కు కానీ, కేటీఆర్కు కానీ చెప్పలేదని వివరించారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ నివాసంలో కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్రెడ్డి ఓ మంత్రిగా కాకుండా మూర్ఖుడిలా మాజీ మంత్రి హరీశ్రావుపై మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
నిజంగా మొగోడే అయితే హరీశ్రావు రాజీనామా సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఓ మంత్రిగా కనీస సబ్జెక్టు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఆగస్టు 15లోగా సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాడని, సీఎం హామీలపై నమ్మకం లేకనే హరీశ్రావు రాజీనామా సవాల్ చేశారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి నిజంగా రుణమాఫీ చేస్తాడని అనుకుంటే హరీశ్రావు సవాల్ను ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. హరీశ్రావు రాజీనామా పత్రం పట్టుకొని వస్తే కోమటిరెడ్డి ఇంట్లో కూర్చొని మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో హరీశ్రావు నుంచి రాజీనామా లేఖ తీసుకొస్తానని, మరి రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి తమ రాజీనామా లేఖలను కూడా తీసుకురావాలని సవాల్ చేశారు. . టెస్కాబ్ చైర్మన్ కొం డూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ పాల్గొన్నారు.