హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు కౌషిక్ రెడ్డి(Kaushik Reddy), మాణిక్ రావు’( Manik Rao)అన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందన్నారు. ఉద్యోగాలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు.
ఈ రోజు ఫిబ్రవరి1 ..కాంగ్రెస్ జాబ్ కేలెండర్ ప్రకారం నేడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డికి ఏమైనా మతిమరుపు వచ్చిందా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఉదయం 6 గంటల నుంచి పని మొదలు పెట్టి రాత్రి రెండు గంటల వరకు ప్రజల కోసమే పని చేస్తాడు. అలాంటి వ్యక్తితో నీకు పోలికే దన్నారు. హరీశ్ రావు శ్రమ వల్లే నిన్న రేవంత్ ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు సాకారం అయ్యాయని గుర్తు చేశారు.
బిల్లా, రంగాలకు ప్రతి రూపం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి రోజూ వాళ్ల పేర్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను బొంద పెడతా అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా? రేవంత్ సీఎంలా వ్యవహరించాలి. కానీ రౌడీ లా కాదు అని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో లోపాలు వెతకడం కాదు..ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఎవరు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టోదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ ఆటలు సాగనివ్వమన్నారు.