Nanded BRS Meeting | ఈ నెల 5వ తేదీన నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాల్క సుమన్, జోగు రామన్న, హన్మంత్ షిండే, సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాందేడ్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు.
నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అప్పారావు పేట్, షివిని, ఇస్లాపూర్, హిమాయత్ నగర్ గ్రామాల్లో కలియ తిరిగారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్థానిక ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కాలనీల్లోకి వెళ్ళి వృద్దులతో ముచ్చటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, ఫించన్లు కూడా రావడం లేదని, గూడుకు కూడా నోచుకోవడం లేదని, మంచి సౌలత్లు లేవని మహిళలు, వృద్దులు మంత్రి ముందు వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మాక్కూడా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారని వ్యాఖ్యానించారు. నాందేడ్ సభకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.