MLA Sunitha | యాదాద్రి భువనగిరి : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ గిరిజనోత్సవం కార్యక్రమంలో భాగంగా బొమ్మల రామారం మండలం పిల్లిగుండ్ల తండాలో ఏర్పాటు చేసిన గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సునీత మాట్లాడారు. దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు అని ఆమె తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతున్నదని తెలిపారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతున్నారని, ఈ దిశగా సీఎం కృషి ఎనలేనిదని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని ఆమె తెలిపారు. సేవాలాల్ మహారాజ్ అయితే మన జాతి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, బాగుండాలని కోరుకుంటే దానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తండాలో మనమే పరిపాలించుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారని తెలిపారు. గిరిజనులంతా ఐకమత్యంతో మెలిగి పార్టీలకు అతీతంగా పట్టుదలతో పరస్పర సమన్వయంతో పనిచేసి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె ఆకాంక్షించారు.