తాండూరు, జూన్ 24: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాండూరులో జూలై 3 నుంచి 13 వరకు శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందుకోసం శనివారం తాండూరు నుంచి కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఉన్న శృంగేరి శారద పీఠాధిపతులను ఆహ్వానించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కారులో వెళ్తుండగా, కర్ణాటక రాష్ట్రం ఉడిపి సమీపంలో కారు టైరు పేలి చెట్టును ఢీకొట్టింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో రోహిత్రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు.