హైదరాబాద్ : బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకులకు నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడాన్ని భరించలేక తమపై దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని విమర్శించారు. ఈడీ ద్వారా నోటీసు పంపి.. అందులో ఏ కేసు గురించి అడుగలేదని, వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. మొదటి రోజు ఆరు గంటలు విచారించారని, ఏ కేసు విషయంలో విచారిస్తున్నారో చెప్పలేదని, ఎలక్షన్ అఫిడవిట్ గురించి సమాచారం అడిగారని చెప్పారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. కేసుకు సంబంధంలేని అభిషేక్ను విచారించారని, పొంతన లేని వివరాలను అడిగారని ఆరోపించారు.
తనను భయబ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తననే విచారించడం విడ్డూరంగా ఉందని, తనతో పాటు అభిషేక్ను విచారిస్తే వారికి కావాల్సింది దొరకలేదన్నారు. తాజాగా నందకుమార్ను విచారిస్తున్నారని, ఏదో విధంగా నందకుమార్ స్టేట్మెంట్ తీసుకొని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దొంగే దొంగ అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందని, బీజేపీకి అనుకూలంగా నందు వాంగ్మూలం తీసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తుందని, ఈ మేరకు తనకు సమాచారం ఉందని రోహిత్రెడ్డి పేర్కొన్నారు. తననే నేరస్థుడిగా చూపేలా నందకుమార్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారన్నారు. తనతో పాటు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఎనిమిది రాష్ట్రాల్లో దొంగ దారిలో ప్రభుత్వాలను పడగొట్టారని, తెలంగాణలో ప్రయత్నం బెడిసికొట్టే సరికి బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. ఎన్ని కేసులతో భయపట్టినా, బీజేపీకి భయపడేది లేదన్నారు. ఈడీ నోటీసులు, నందకుమార్ కస్టడీపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపిన ఆయన.. బీఎల్ సంతోష్, తుషార్ సిట్ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ ప్రశ్నిస్తోందని, తన పరిధిలోకి రాని కేసును ఈడీ ఎందుకు టేకాఫ్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని, ఇది ప్రజాసమస్య అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళుతుంటే.. అభివృద్ధిని చూడలేక కుట్రలు పన్నుతున్నారని, ప్రజాస్వామ్యం ఎటువెళ్తుందో అందరూ ఆలోచించాలని, బీజేపీ అరాచకాలను గమనించాలన్నారు. తెలంగాణ సమామంతా ఏకమైన బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు.