BRS MLA Palla | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తనపై, తన కుటుంబసభ్యులపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేతలు క్యామా మల్లేశం, పార్టీ నేతలు దరువు ఎల్లన్న, తుంగబాలు తదితరులతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తీన్మార్ మల్లన్న తన సతీమణి నీలిమపై అసత్యప్రచారం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీలిమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, బీఆర్ఎస్ సర్కార్లో దొడ్డిదారిన నీలిమ ఉద్యోగం సంపాదించారని తీన్మార్ మల్లన్న పేర్కొనటాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజానికి తన భార్య నీలిమ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించటమే కాక ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్లో స్టేట్ ర్యాంకు సాధించారని వివరించారు. అనంతరం 1992లోనే ఏపీఎస్ఈబీలో ఉద్యోగం సాధించారని, అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే 2015లోనే డివిజనల్ ఇంజనీర్గా పదోన్నతి పొందారని, విద్యుత్సౌధ, కల్వకుర్తి, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో పనిచేశారని చెప్పారు.
ఆ తరువాత తన భార్య నీలిమ ఆరు నెలలు డిప్యూటేషన్పై రాష్ట్ర సచివాలయంలో కూడా పనిచేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. 2016 నుంచి 2020 వరకు నీలిమ వేతన రహిత సెలవులో ఉన్నారని వివరించారు. అలాగే 2020 నవంబర్ 19న వీఆర్ఎస్ తీసుకుని ప్రస్తుతం అనురాగ్ విద్యా సంస్థలకు సీఈవోగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆధారాలతో వివరించారు. తమపై, తమ కుటుంబంపై తీన్మార్ మల్లన్న చేసిన అసత్యప్రచారానికి తాము పరువునష్టం దావా వేస్తామన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న నేపథ్యంలో పనిగట్టుకొని ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలపై అబద్దాలు ప్రచారం చేయటమే విధానంగా పెట్టుకున్నారా? దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత తీన్మార్ మల్లన్న తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. వాటిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) తనపై రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారని చెప్పారు. తీన్మార్ మల్లన్న, ఆయన బృందం ప్రభుత్వం నీలిమకు ఏదో దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తమ విద్యాసంస్థల వద్దకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్న తీన్మార్ మల్లన్న అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రజలు గతంలో అనేక ఫిర్యాదులు చేశారని, తాజాగా కాంగ్రెస పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కూడా తీన్మార్ మల్లన్నపై అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. తమ విద్యాసంస్థల్లో ఏలాంటి అవినీతి, అక్రమాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రతి నెల అయిదో తేదీలోపే జీతాలను కూడా చెల్లిస్తున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, తనపై జనగామలో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్ధి నియోజకవర్గంలో అధికారులను బెదిరిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడని చెప్పారు. తమకు చెందిన అనురాగ్ యూనివర్సిటీకి ఇంటలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను, ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారని, కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తను హత్యచేశారని ఇదేం పద్దతి అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తొలగించిందని, గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉన్నదని, ప్రాణహాని ఉన్నవారి రక్షణ బాధ్యత తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరించడం కక్షపూరిత చర్యగా బాల్కసుమన్ అభివర్ణించారు.
బీఆర్ఎస్ నేతల ఫోన్లను నిఘా విభాగం అధికారులు ట్యాప్చేసి వింటున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ నేతల బుద్ది మారడంలేదని, ప్రజాపాలన మాటల్లోనే ఉన్నదని, చేతల్లో కనిపించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల పేరుతో తాను ఇచ్చిన ఎన్నికల హామీలను వాయిదావేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.
రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందని అంటున్న కాంగ్రెస్ పెద్దలు.. రాష్ట్ర ఖజానా నుంచి రైతుబంధు నిధులను మంత్రుల కంపెనీలకు మళ్లించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న జరుగుతున్న ప్రచారంపై ఎందుకు సమాధానం చెప్పడంలేదని బాల్క సుమన్ నిలదీశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. ఉన్న బస్సు సర్వీలను తగ్గించారని, డిమాండ్కు తగినట్లు బస్సులను నడిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగాయని, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు జీవనభృతి ఇవ్వాలన్నారు.